● జిల్లా కేంద్రంలో కానరాని ప్రభుత్వ బాలుర ఇంటర్ కాలేజీ
● దూరప్రాంతాలకు వెళుతున్న విద్యార్థులు
మదనపల్లె సిటీ : జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ బాలుర కాలేజీ కలగానే మిగిలిపోయింది. స్థానికంగా ఇంటర్ కళాశాల లేకపోవడంతో పదో తరగతి పూర్తయిన విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. లేదా స్థానికంగా ప్రైవేటు కళాశాలల్లోనే చేరాల్సి వస్తోంది. విద్యా కేంద్రంగా పేరు పొందిన మదనపల్లెలో కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఇంటర్ కాలేజీ లేకపోవడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో అమ్మాయిలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
బీటీ కాలేజీలో మూతపడిన ఇంటర్కోర్సులు
చారిత్రక నేపథ్యం ఉన్న బిసెంట్ థియోసాఫిక్ కాలేజీలో ఇంటర్ కోర్సులు ఎత్తివేశారు. కాలేజీలో గతంలో ఇంటర్మీయడ్ విభాగంలో బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు నడిపారు. ఎంతో మంది పేద,మద్య తరగతి విద్యార్థులు కాలేజీలో అభ్యసించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వంలో విలీనం చేయాలని లేకుంటే ప్రైవేటు సంస్థలే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో బీటీ కాలేజీ కొంత భాగాన్ని ప్రభుత్వపరం చేశారు. దీంతో బీటీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మారింది. ఫలితంగా ఐదేళ్లుగా కాలేజీలో ఇంటర్ విద్య మూతపడింది.
దూర ప్రాంతాలకు వెళుతున్న విద్యార్థులు
మదనపల్లె పరిసర ప్రాంతాల్లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు కొందరు తిరుపతి, విజయవాడకు వెళుతుంటే ,మరికొందరు స్థానికంగా ప్రైవేటు కాలేజీలో చేరుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేద, మధ్య తరగతి విద్యార్థులు వాపోతున్నారు.


