పీలేరురూరల్ : స్థానిక ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్లోని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) భూములను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ పరిశీలించారు. నాలుగేళ్ల క్రితం టౌన్షిప్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్కు 30 ఎకరాలు కేటాయించింది. అందులో లేఅవుట్ వేసి మధ్యతరహా ఆదాయం కల్గిన వారికి విక్రయించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పలు కారణాలతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో గురువారం చిత్తూరు జేసీ పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందిన కేటాయింపులు, ఉత్తర్వులు, భూరికార్డులు, సరిహద్దు తదితర వివరాలపై ఆరా తీశారు. ఆర్ఐ మురగయ్య, సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వోలు ఎల్లప్ప, సిద్ధయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.
నీటి సమస్యపై
కంట్రోల్ రూం
సాక్షి, మదనపల్లె : మదనపల్లె పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యపై మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కమిషనర్ కే.ప్రమీల గురువారం తెలిపారు. పట్టణ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా నీటి సమస్య ఉత్పన్నమైనా, నీటి సరఫరా జరగకపోయినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. నీటి సమస్యలపై ప్రజలు 08571–222280 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు అందుకున్న తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.


