కడప ఎడ్యుకేషన్ : ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తితోపాటు సేవాభావం పెంపొందుతాయని ఎన్సీసీ క్యాంపు కమాండెంట్ కల్నర్ ఎన్. సూర్యనారాయణమూర్తి తెలిపారు. కడప నగరంలోని తెలుగు గంగ కాలనీలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ ఎన్. సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సీఏటీసీ– 5 ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం గురువారం ఉత్సాహంగా కొనసాగింది. జూలై 15 నుంచి 24 వరకు పది రోజులపాటు జరుగుతున్న ఈ శిబిరంలో కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్. సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ నాలుగు జిల్లాల నుంచి టీఎస్సీ (తాల్ సైనిక్ క్యాంప్) రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించిన క్యాడెట్లకు మ్యాప్ రీడింగ్, ఫైరింగ్ తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు. అలాగే రిపబ్లిక్ డే క్యాంప్ (డీఆర్సీ) కోసం డ్రిల్, ఫైరింగ్, బెస్ట్ క్యాడెట్ తదితర విభాగాల్లో జరిగే ఎంపికలకు క్యాడెట్లను సన్నద్ధం చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.


