అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదు: పేర్ని నాని | YSRCP Perni Nani Serious On Chandrababu Over Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదు: పేర్ని నాని

Jul 4 2026 1:17 PM | Updated on Jul 4 2026 1:39 PM

YSRCP Perni Nani Serious On Chandrababu Over Amaravati

సాక్షి, తాడేపల్లి: అమరావతిని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు తీరని మోసం చేశారని అన్నారు. మీరు కట్టే ఆఫీసులకే రూ.50వేల కోట్లు అయితే.. రైతులకు ఏం ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. అలాగే, రెండేళ్ల పాలనలో కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు?. యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్ట్‌ చేసి వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు.  

మాజీ మంత్రి పేర్ని నాని తాడిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుందని అడిగితే సమాధానం చెప్పడం లేదు. అప్పు ఎంత అవుతుందో అన్న దానికి సమాధానం చెప్పరు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూషిస్తున్నారు. మంత్రులు తిట్లు, శాపనార్థాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి రూ.50వేల కోట్లు అప్పులు తెచ్చారు. మీరు కట్టే ఆఫీసులకే రూ.50వేల కోట్లు అయితే.. రైతులకు ఏం ఇస్తారు?. వైఎస్‌ జగన్‌ ప్రశ్నకు ఒక్కరూ సమాధానం చెప్పరు. మంత్రులు తమ శాఖ పనితీరు గురించి ఒక్కరూ మాట్లాడరు. ఆసుపత్రిలో సౌకర్యాలు లేవంటే మాట్లాడరు. రోగులు ఇబ్బందులు పడుతుంటే మాట్లాడరు. వైఎస్‌ జగన్‌ను తిట్టేందుకు మాత్రం మంత్రులు పరిగెత్తుకుంటూ వస్తారు.

మావిగన్‌ అంటే భయం..
మావిగన్‌ అంటే కూటమి నేతలు భయపడుతున్నారు. అమరావతి నిర్మాణానికి ఎన్ని ఏళ్లు పడుతుంది. సింగపూర్‌ మించి రాజధాని నిర్మాణం చేస్తామని అన్నారు. చివరకు అమరావతిని ఓ మున్సిపాలిటీగా చేస్తున్నారు. అమరావతి పేరుతో అంతులేని అవినీతి, మోయలేని అప్పులు చేస్తున్నారు. అమరావతి దోపిడీ ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనబడుతోంది. రైతుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. రాజధానిలో పేదలకు జగన్‌ ఇచ్చిన 50వేల ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. ఇళ్ల పట్టాలు రద్దు చేశాక అమరావతిలో ఎవరు ఉంటారు?? జనం లేని రాజధాని ఎందుకు?. అమరావతిలో స్టార్‌ హోటల్స్‌ కట్టి ఏం చేస్తారు??

అమరావతి రైతులను కలిసేందుకు వెళ్తే దాడులు చేస్తారు. కూటమి నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారు. రైతుల కష్టాలు చూసేందుకు మళ్తీ రైతుల వద్దకు వెళ్తాం. అమరావతికి వెళ్తాం.. తగ్గేది లేదు.. భయపడేది లేదు. పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నారు. మావిగన్‌ అనే పేరు చెబితే చంద్రబాబు అల్లాడిపోతున్నారు. అమరావతిలో అవినీతి జరగడం లేదని నిరూపించండి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే సాహసం ఉందా?. లంచం ఇస్తే కానీ, ఈ ప్రభుత్వంలో ఏ పని అవదు. 

ప్రశ్నిస్తే వేధింపులా?
ఎప్పుడూ కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు?. ఈ రెండేళ్ల కాలంలో దళితులకు ఏం చేశారు?. యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్ట్‌ చేసి వేధిస్తున్నారు. జనసేన రౌడీలు పోలీసు స్టేషన్‌ గోడ దూకి దాడి చేసేందుకు వెళ్తున్నారు. పీఎస్‌ గోడలు దూకిన వారిపై కేసులు నమోదు చేశారా?. ప్రశ్నించే సోషల్‌ మీడియా మీద దాడులు చేస్తున్నారు. రావణ్‌ విషయంలో పోలీసులు చట్ట విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్‌ టెర్రస్‌పై కాల్చి బూడిద చేశారా?. స్టేషన్‌లో ఉన్న సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టరు?’ అంటూ మండిపడ్డారు.

రాజధానిలో ఇళ్లు కట్టుకున్న చంద్రబాబు, మంత్రి నారాయణ వివరాలను ఎందుకు బ్లాక్ చేశారు?. చెప్పే దమ్ము, ధైర్యం మంత్రులకు ఉందా?. కాపులకు కూటమి ప్రభుత్వం మీద విసుగెత్తింది. కాపు నేతలమంతా లంచ్ మీటింగుకి వెళ్తే మమ్మల్ని తిట్టిస్తున్నారు. జనసేన బలహీన పడి, కాపులంతా పక్కకు వెళ్తున్నారు. దీంతో కాపులను తిట్టించి మళ్ళీ జనసేన దగ్గరకు చేరేలా చేస్తున్నారు. ప్రశ్న రావణ్‌ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ, జనసేన మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న చోటే రావణ్‌పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. పవన్‌కి మోటివేటెడ్ డిజార్డర్స్ ఉంది. అప్పటికప్పుడు కావాలని వేషం మార్చుతాడు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు హరిప్రసాద్‌కు బందరులో ఏం పని?. కాపులను పవన్ కళ్యాణ్ బకరాలను చేసి వాడుకుంటున్నారు. పోలీసు అధికారులకు దమ్ముంటే ఇప్పటికే కేసు పెట్టేవారు అని ఎద్దేవా చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement