
( ఫైల్ ఫోటో )
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలన రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ పరిపాలన రాజధాని కాబోతుందని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. లీగల్ ఇష్యూస్ వల్ల కాస్త ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.
కాగా, వైవీ సుబ్బారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్రెడ్డి రెండు, మూడు నెలల్లో విశాఖ రాబోతున్నారు. త్వరలోనే విశాఖ ఏపీ పరిపాలన రాజధాని కాబోతుంది. అన్ని ప్రాంతాల ప్రజలకు అనువైన ప్రాంతం విశాఖ. దక్షిణ భారతదేశానికి ముంబై నగరం వంటిది విశాఖ అని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇదే సమయంలో పుంగనూరులో టీడీపీ శ్రేణుల దాడిపై కూడా సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై మాట్లాడుతూ.. చంద్రబాబు మీద దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు బలమేంటో 2019 ఎన్నికల్లోనే చూశాం. చంద్రబాబు ఏమైనా పెద్ద బలవంతుడా దాడులు చేయడానికి.. ఓడిపోయిన తర్వాత మూడేళ్ల పాటు చంద్రబాబు ఇంట్లోనే ఉన్నారు. ఏడాది నుంచి బయటకు వచ్చి టీడీపీపై దాడి అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు తరహాలోనే ప్రజలను రెచ్చగొడుతున్నారు. పవన్కు ఒక విధానం అంటూ లేదు. ఒకసారి సీఎం పదవి వద్దంటాడు.. మరోసారి పదవి కావాలంటాడు అంటూ విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: ఈనాడు బ్యానర్.. పచ్చ బ్యాచ్ కోసం పాకులాట.. రామోజీ అడ్డంగా దొరికాడు