ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం | YS Jagan Mohan Reddy meets people at Pulivendula camp office | Sakshi
Sakshi News home page

ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం

Dec 27 2024 4:55 AM | Updated on Dec 27 2024 10:52 AM

YS Jagan Mohan Reddy meets people at Pulivendula camp office

ఈ దుర్మార్గ ప్రభుత్వ తీరును నిలదీద్దాం.. ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వండి 

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

ఎవరూ అధైర్య పడొద్దు.. ధైర్యంగా ఎదుర్కొందాం

కష్టాలు కొద్ది కాలమే.. తర్వాత మన టైమ్‌ వస్తుందని భరోసా

పులివెందుల క్యాంప్‌ కార్యాలయానికి పోటెత్తిన అభిమాన జనం

కష్టాలు చెప్పుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు

అందరి సమస్యలు ఓపికగా విన్న జననేత

సాక్షి ప్రతినిధి, కడప : ‘రాష్ట్రంలో కూటమి ప్రభు­త్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెన్‌ లేదు.. ఆరు నెలల్లోనే ఇదివరకెన్నడూ లేనంతంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రశ్నించిన వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. అందువల్ల ప్రజల గొంతుకగా మనం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రశి్నద్దాం.. నిలదీద్దాం. ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధమవ్వండి. ధైర్యంగా ఎదుర్కొందాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

వైఎస్సార్‌ జిల్లా పులివెందుల భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలు, ప్రజలు, నేత­లు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను..’ అని భరోసా ఇచ్చారు. కష్టాలు కొద్ది కాలమేనని.. ఆ తర్వాత మన టైమ్‌ వస్తుందని ధైర్యం చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అధికార అండ చూసుకుని ఆ పార్టీ నేతలు అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్య పడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదని భరోసా కల్పించారు. 

మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథా ఎంచుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం  
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.పులివెందులలోని క్యాంపు కార్యాలయం గురువారం పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ సూచించారు. వివిధ సమస్యలతో బాధ పడుతున్న పలువురు జగన్‌ను కలిసి విన్నవించుకున్నారు. 

స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచి్చన వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. 

ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ చార్జీలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిoదని చెప్పారు.  కాగా కుప్పం అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. వారిని కట్టడి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆ ప్రాంత సర్పంచ్‌లు, యూత్‌ వింగ్‌ నాయకులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. ఓ అభిమాని గీసిన జననేత చిత్రం ఫొటో ఫ్రేమ్‌పై జగన్‌తో సంతకం చేయించుకున్నాడు. 

జగన్‌ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమ­ర్‌నాథరెడ్డి, డాక్టర్‌ సుధా, ఎమ్మెల్సీలు డీసీ గోవిందురెడ్డి, రమేష్‌ యా­దవ్, కడప మేయర్‌ సురేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌బి అంజాద్‌భాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురావి­ు­రెడ్డి, మేకా ప్రతాప్‌ అప్పారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్ రెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.  

వైఎస్సార్‌ టీచర్స్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ  
వైఎస్సార్‌ టీచర్స్‌ అసోషియేషన్‌ క్యాలెండర్, డైరీని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అసోసియేషన్‌ ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు వెంకటనాథరెడ్డి, సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement