వైఎస్‌ జగన్‌కు ‘సీఎం ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు

YS Jagan Mohan Reddy Conferred With SKOCH CM of The Year - Sakshi

మొత్తం 123 ప్రాజెక్టులు అధ్యయనం చేసి అవార్డుకు ఎంపిక చేసిన స్కోచ్‌ గ్రూప్‌

ఏపీలో పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలు

ఆర్బీకేలతో ముందే ప్రకటించిన మద్దతు ధరకు గ్రామాల్లోనే పంటల కొనుగోలు

వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా మహిళలకు ఆర్ధిక సాధికారత 

దిశ – అభయ ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు

సాక్షి, అమరావతి: పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ‘సీఎం ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు స్కోచ్‌ గ్రూపు ఎంపిక చేసింది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్‌ గ్రూప్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు. మంగళవారం క్యాంపు క్యార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ‘సీఎం ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును ఆయన అందజేశారు. 

ఆదర్శంగా ఆర్బీకేలు..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టు స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపిక చేసినట్లు స్కోచ్‌ గ్రూపు చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన ఫలితాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ముందుగానే ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయడం ఆసక్తికర నమూనాగా నిలిచిందని వెల్లడించారు. దీనివల్ల రైతులకు భారీ ప్రయోజనం కలగడంతో పాటు మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా మహిళల ఆర్ధిక సాధికారతకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు జీవనోపాధికి చేయూ త, అనుసంధాన రుణాలు ఇవ్వడం ద్వారా మహిళ ల ఆర్ధిక సాధికారతకు దోహదం చేశారన్నా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుం దని తెలిపారు. దిశ, అభయ పథకాల ద్వారా మహిళల భద్రత, రక్షణకు చర్యలు తీసుకున్నారని, తద్వారా శాంతి భద్రతలు వెల్లివిరియడంతోపాటు మహిళల్లో భరోసా పెరిగి గణనీయమైన మార్పులు తెచ్చిందని తెలిపారు. 

కోవిడ్‌ నియంత్రణలో సమర్థంగా..
కోవిడ్‌–19 నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా స్పందించిన తీరు, తీసుకున్న చర్యలతో పాటు 123 ప్రాజెక్టులపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో మెరుగైన ఫలితాలు స్పష్టంగా కనిపించాయని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ వివరించారు. పాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు గత రెండేళ్లలో రాష్ట్రంలో పలు విప్లవాత్మక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వివిధ రంగాల్లో వినూత్న చర్యలు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కు దక్కుతుందన్నారు. 

చదవండి: పల్లెపల్లెన 540 సేవలు
                 
 ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top