సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
మందా సాల్మన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థి క సాయం
వైఎస్సార్సీపీ తరఫున వైఎస్ జగన్ ప్రకటన.. సాల్మన్ కుటుంబ సభ్యులకు ఫోన్లో పరామర్శ
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం ముసుగులో రాష్ట్రంలో హత్యా రాజకీయాలు సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాల ఫలితంగానే గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మందా సాల్మన్ కిరాతకంగా హత్యకు గురయ్యాడని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు సొంత గ్రామానికి వచ్చిన సాల్మన్పై ఇనుప రాడ్లతో దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన బాధాకరమన్నారు.
పైగా హత్యకు గురైన వ్యక్తిపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా? అని నిలదీశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షలతో హింసను ప్రోత్సహిస్తోందని, ఇది స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘన అని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ పూర్తి అండగా నిలుస్తుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ పోస్టులో ఏం చెప్పారంటే..
ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు?
సీఎం చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెబుతారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేస్తారా? పైగా సాల్మన్పైనే తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచి్చంది? ఈ ఘటన ముమ్మాటికీ వైఎస్సార్సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీ వారి ద్వారా, కొంత మంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే.
మీరు మూల్యం చెల్లించక తప్పదు
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ, ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందల కొద్దీ వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాల వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా మారణకాండను ప్రోత్సహించారు.
పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో శాంతి భద్రతలను ధ్వంసం చేస్తున్నారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షల కోసం శాంతిభద్రతలను దెబ్బ తీసి.. హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? హింసా రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో రేపు అదే పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీ వారి చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది.


