
సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
మా పార్టీ వాళ్ల ఇంటికి నేను వెళ్లడం తప్పా?
కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం తప్పు కాదా?
శాంతి భద్రతల సమస్య ఎవరు సృష్టిస్తున్నారు?.. నువ్వు అబద్ధాలు, మోసాలతో అందరి ఉసురు పోసుకుంటున్నావ్
కాబట్టే నీ ముఖం చూడటానికి ఎవరూ రావడం లేదు
చెప్పిన మాట నిలబెట్టుకుని.. అందరికీ మేం మంచి చేశాం
అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువై వస్తున్నారు
వాళ్లకు లేని బాధ నీకెందుకు?
పుష్ప సినిమా డైలాగ్లు పెట్టినా తప్పేనా?
లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేను ప్రజల వద్దకు పోతాను.. కలుస్తాను.. వస్తాను.. వీళ్లకు ఏం సంబంధం? రైతుల దగ్గరకు వెళ్లాను.. కలిశాను.. రైతు సమస్యలు లేవనెత్తాను.. ప్రెస్లో అడ్రస్ చేశాను.. ఏం తప్పు జరిగింది.. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా నా ధర్మం నేను చేశాను.. నా కార్యక్రమం అడ్డుకుంది మీరు.. ఎందుకు అడ్డుకున్నారు? నా ప్రోగ్రాంకు ఎంత మంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రాంకు రాలేదని నీకెందుకంత బాధ? నీ ముఖం చూడటానికి ఎవరూ రావడం లేదంటే.. నువ్వు చేసిన పనులు అట్లా ఉన్నాయి..
నువ్వు అబద్ధాలు చెప్పి.. అందరినీ మోసం చేసి, అందరి ఉసురు పోసుకుంటున్నావు. మేము మా ప్రభుత్వంలో చెప్పిన మాట మేము నిలబెట్టుకున్నాం.. అందరికీ మంచి చేశాం.. అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువై వస్తున్నారు. వాళ్లు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమన్నా వారికి భోజనం పెడుతున్నావా? వారిని చూసుకుంటున్నావా? మా పార్టీ వాళ్లు.. నన్ను అభిమానించే వాళ్లు.. నన్ను ప్రేమించే ప్రజలతో నేను మమేకం అవుతున్నాను. వాళ్లకు లేని బాధ నీకెందుకు? - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘మా పార్టీ వాళ్ల ఇంటికి నేను వెళ్లడం తప్పా? ఆ ఇంటిలో ఉన్న పెద్దాయన వెంకటేశ్వర్లు మీద కేసు పెట్టడం ధర్మమేనా? ఇది ప్రజాస్వామ్యమేనా?’ అని సీఎం చంద్రబాబును వైఎఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా సమాధానాలిచ్చారు. ‘నా పల్నాడు పర్యటనపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. దండయాత్ర చేశారని ఆరోపిస్తున్నారు.
మరణించిన వ్యక్తి మా పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్. పోలీసుల వేధింపుల వల్ల చనిపోయిన నేపథ్యంలో అతని తండ్రి ప్రైవేటు ఫిర్యాదు చేస్తే, కోర్టు ఆదేశించినా కేసు నమోదు చేయలేదు. ఆ సీఐ రాజేష్ మీద ప్రైవేట్ కంప్లైంట్ లాంచ్ చేసి కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చినా కేసు కట్టలేదు. అలాంటి ఆయన బాధలో భాగస్వామినవుతూ.. నేను మా పార్టీకి సంబంధించిన వాళ్ల ఇంటికి వెళ్లడం తప్పా? ఆయన పెట్టింది తన కొడుకు విగ్రహం. అది పెట్టుకున్నది ఆయన సొంత స్థలంలో.. అదీ తన ఇంటిపక్కన.. అది ఆయన ఇష్టం.
ఈ విషయంలో నేను పోవడం ఏ విధంగా తప్పు అవుతుంది? అలా పోవటం తప్పన్నట్లు కర్ఫ్యూ వాతావరణం తీసుకురావడం తప్పు కాదా? నేను ఏ ఇంటికైతే వెళ్లానో.. ఆ ఇంట్లో పెద్దాయన వెంకటేశ్వర్లు మీద కేసు పెట్టడం భావ్యమేనా? అంటే మనం డెమోక్రసీలో ఉన్నామా? లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు. రాష్ట్రంలోనే ఉంటాయి’ అంటూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఏం సమాధానం ఇచ్చారంటే..
ప్రభుత్వం పట్టించుకుని ఉంటే సమస్య ఏముంది?
ప్రతి ఒక్కరి మీద అభాండాలు వేయడం చంద్రబాబుకు అలవాటై పోయింది. పొగాకు రైతులకు గానీ, మిర్చి రైతులకు గానీ, అదే తెనాలిలో జరిగిన ఘటనలో గానీ.. నిన్న జరిగిన ప్రైవేటు కంప్లైంట్ విషయంలో గానీ ముందే ఎందుకు స్పందించలేదు? ఇవన్నీ జన్యూన్ ప్రాబ్లమ్స్ కాదా? నష్టపోయిన వారికి సంఘీభావం తెలుపుతూ.. వాళ్లతో పాటు వారి బాధలో నేను ఏకమైతే నీకేం బాధ? నేను పాలుపంచుకునే వరకు నువ్వెందుకు స్పందించలేదు? నువ్వు స్పందించి ఉంటే నేను పోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా? నువ్వు స్పందించడంలేదు కాబట్టే.. నేను పోవాల్సి వస్తోంది.. చంద్రబాబూ.. నువ్వు బాగా పట్టించుకుని ఉంటే సమస్య ఏముంది?
వరద జలాలు ఒడిసి పడితేనే లాభం
‘గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అనేది ఎలా చేస్తారనేది, ఎప్పుడు చేస్తారనేది ముఖ్యమైన అంశం. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి వరద జలాలు సముద్రంలో కలుస్తాయి.. ఇందులో 80 శాతం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు.. 4 నెలల్లోనే వరద ప్రవాహం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలే. వరద ప్రవాహాన్ని నాలుగు నెలల్లోనే గరిష్ఠంగా ఒడిసి పట్టాలంటే పోలవరం కుడి కాలువను వెడల్పు, లోతు చేసి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి.

ఆ నీటిని కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు అందించగలిగితే.. తద్వారా మిగిలే కృష్ణా జలాలను శ్రీశైలంలో నిల్వ చేసుకుని.. వాడుకోగల స్వేచ్ఛ ఉంటే.. గ్రావిటీపై రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లందించవచ్చు. కృష్ణా నది వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ నిండాక వరద జలాలను రాయలసీమకు మళ్లించాలంటే.. కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులు చేయాలి. ఆ వరద నీటితో రిజర్వాయర్లను నింపుకుంటూ వెళ్లాలి. శ్రీశైలంలో మిగిలిన నీటిని తీసుకొని పోవాలంటే రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేయాలి. ఇవన్నీ దశల వారీగా చేయాల్సిన పనులు’ అంటూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.
» ‘మీ ప్రభుత్వ హయాంలో.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ ట్యాపింగ్లో పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారని షర్మిల చెబుతున్నారు. దానికేం సమాధానం చెబుతారు’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ ‘ఆ సమయంలో ఆమె అక్కడ క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో నిజంగా ట్యాపింగ్ చేశారో లేదో నాకు తెలియదు. ఒకవేళ పక్క రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే దానికి నాకేంటి సంబంధం?’ అని ప్రశ్నించారు.
రప్పా.. రప్పా.. సినిమా పోస్టర్
గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్పా రప్పా నరికేస్తాం.. అనే పోస్టర్కు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటా.. (పుష్ప 2 సార్ అని ఓ విలేకరి అన్నారు). పుష్ప సినిమా డైలాగ్లు పెట్టినా తప్పేనా? దానికీ కేసులు పెడుతున్నారంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా అనేది నాకర్థం కావడం లేదు. పుష్ప డైలాగులు చెప్పినా తప్పే.. గడ్డం ఇట్టన్నా తప్పే. గడ్డం అట్టన్నా తప్పే. ఏంది సామీ ఇది!? ఏ ప్రపంచంలో ఉన్నాం మనం?’ అని అన్నారు.
ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, అతడికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉందని కొందరు జర్నలిస్టులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ‘ఆ పోస్టర్ పట్టుకున్న యువకుడికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందంటే, అది టీడీపీ వాళ్లే చేయించినట్టనుకోవాలి. ఒకవేళ పార్టీ మారి ఉంటే అంతకన్నా మంచి పరిణామం ఉండదు. టీడీపీ కార్యకర్త కూడా చంద్రబాబు మీద కోపంతో పార్టీ మారాడంటే మంచిదే’ అని వైఎస్ జగన్ అన్నారు.