తాడేపల్లి: `పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. వారు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.
‘‘వైద్య రంగంలో విశిష్ట సేవలకుగాను డా.నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కాగా, రాష్ట్రపతి భవన్లో మంగళవారం రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మందికి రాష్ట్రపతి పద్మ అవార్డులు అందజేశారు.


