సాక్షి,తాడేపల్లి: బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


