ఉగ్గుపాలతో దేశభక్తి.. మాధవరం వీరుల స్ఫూర్తి! | The village had 1850 soldiers in the two Pakistan wars | Sakshi
Sakshi News home page

ఉగ్గుపాలతో దేశభక్తి.. మాధవరం వీరుల స్ఫూర్తి!

May 11 2025 5:13 AM | Updated on May 11 2025 5:13 AM

The village had 1850 soldiers in the two Pakistan wars

రెండు పాక్‌ యుద్ధాల్లో ఆ గ్రామం సైనికులు 1,850 మంది

ప్రస్తుతం పనిచేస్తున్న వారు 500 మంది 

మిలటరీ మాధవరంగా ప్రశంసలు

తాడేపల్లిగూడెం: ఇక్కడి మట్టిలో పోరాట స్ఫూర్తి  ఉంది. తల్లుల ఆశీస్సుల్లో సడలని దేశభక్తి ఉంది. భారత్‌తో గతంలో పాక్‌ జరిపిన రెండు యుద్ధాల్లో ఈ గ్రామం నుంచి దాదాపు 1,850 మంది పాల్గొనగా, ఇప్పుడు కూడా 500 మంది సైనికులుగా దేశానికి సేవలు అందిస్తున్నారు. వీరిలో దాదాపు 300 మంది తాజా ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రత్యక్షంగా కదన రంగంలో ఉండగా,  మరో 200 మంది ‘ఏ క్షణమైనా సరిహద్దులకు రెడీ’ అంటూ వివిధ బెటాలియన్లలో సిద్ధంగా ఉన్నారు.  

ఈ గ్రామమే పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం. పేరుకు ముందు ‘మిలటరీ’ని చేర్చుకుని, ‘మిలటరీ మాధవరం’గా ప్రసిద్ధి చెందిందంటే, భారత సైన్యంలో ఈ  పంచాయతీ ముద్ర ఏమిటన్నది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి మాతృమూర్తులు ఉగ్గు పాలలోనే దేశభక్తిని రంగరిస్తారు. దేశభక్తి గీతాలే లాలిపాటలవుతాయి. సైనిక హోదాల పేర్లే ఆ పాటల్లో పదాలుగా వినిపిస్తాయి. 

యుద్ధం ఏదైనా కావచ్చు... 
వాఘా బోర్డర్‌ కావచ్చు.. శత్రువుతో పోరాడే మరేదైనా ప్రాంతం కావచ్చు.. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా శత్రువు తోకముడిచేలా పోరాటం చేయడం ఈ సైనికుల చిరునామా. బ్రిటిష్‌ రెజిమెంట్లలో కూడా ఈ గ్రామస్తులు వివిధ హోదాల్లో పనిచేశారు. సిపాయి నుంచి కల్నల్‌ వరకు మాధవరం వాసులు దేశ సైన్యంలో సేవలు అందచేశారు. ఇప్పటికీ అందజేస్తున్నారు. వివిధ సేవా ప«తకాలను అందుకున్నారు. 

మొదటి, రెండో ప్రపంచ యుద్ధం, చైనా, పాకిస్తాన్‌ యుద్ధాల్లో ఇక్కడి వీర జవానులు పాల్గొన్నారు. తొలి ప్రపంచ యుద్ధంలో 90 మంది. రెండో ప్రపంచ యుద్ధంలో 1,110 మంది.  శ్రీలంక పీస్‌ కీపింగ్‌ ఫోర్సులో 12 మంది, 1960లో గోవా లిబరేషన్‌లో 150 మంది, 1962లో చైనా యుద్ధంలో 850 మంది, 1965 ఇండో–పాక్‌ వార్‌లో 900 మంది, 1971 బంగ్లా విముక్తి పోరాటంలో 950 మంది పాల్గొన్నారు.

సైనిక సేవల్లో నా కుమారుడు, కోడలు.. 
నా కుమారుడు మేజర్‌ డొంకా ప్రవీణ్, కోడలు మేజర్‌ డాక్టర్‌ హరిణి. వీరిరువురూ తాజా ఆపరేషన్‌ సిందూ­ర్‌లో పాల్గొంటున్నారు. ప్రవీణ్‌ ఆఫీసర్‌ స్థాయిలో పనిచేస్తుండగా, మా కోడలు హరిణి డాక్టర్‌గా సైనికులకు సేవలందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ రెండు సంవ­త్స­రాల కుమారుడిని ఇంట్లో వదిలిపెట్టి కదన రంగానికి వెళ్లారు. నా భర్త  ఆర్మీలో 20 సంవత్సరాలు ‘నాయక్‌’గా సేవచేసి మరణించారు. ఇవన్నీ నాకు గర్వకారణాలు.  –  డొంకా రత్నకుమారి

మా అమ్మాయి, అబ్బాయిని పంపుతా.. 
నా భర్త రాంబాబు. అరుణాచల్‌ ప్రదేశ్, రాయ్‌బరేలీ, శ్రీ­నగర్, అంబాలా (హర్యానా) రాజస్ధాన్, గంగానగర్‌ ప్రాంతాల్లో సైన్యంలో పనిచేశారు. ప్రస్తుతం జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా (జేసీఓ) విధులు నిర్వర్తిస్తున్నారు. మా మా­వయ్య వేదాల కృష్ణమూర్తి ఆర్మీలో పనిచేశారు. మా  ఇద్దరు మరుదులు రామచంద్రరావు, వెంకటేశ్వరరావులు ఆర్మీలో పనిచేస్తున్నారు. దేశం అవకాశం ఇస్తే నా కుమారుడిని, కుమార్తెను కూడా సైన్యంలోకి పంపడానికి సిద్ధం. – వేదాల అనూష  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement