
చంద్రబాబు ప్రభుత్వంపై ఏడాదిలో ప్రజా వ్యతిరేకత సుస్పష్టం: డాక్టర్ ప్రదీప్ చింతా
ప్రజలను ‘వెన్నుపోటు’ పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే: మలిరెడ్డి కిషోర్
సాక్షి, అమరావతి/జి.కొండూరు: ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని, వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఇది సుస్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ యూకే కమిటీ కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. 30 ఏళ్లుగా చంద్రబాబు ఇలాగే ఎన్నికల సమయంలో మోసపు మాటలతో అమాయక తెలుగు ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు విదేశాల్లోనూ వెన్నుపొటు దినం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వ ర్యంలో బుధవారం లండన్లో డా.ప్రదీప్ చింతా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అభిమానులు కదంతొక్కారు. లెస్టర్లో వైఎ స్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ చలపతి సర్ప ఆధ్వ ర్యంలో.. నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈస్ట్ లండన్లో వైఎస్సార్సీపీ యూకే కమిటీ కో కన్వీనర్ మలిరెడ్డి కిషోర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎన్ఆర్ఐల నుంచి విశేష స్పందన లభించింది. ‘‘నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు ఏదీ’’, ‘‘ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎక్కడ?’’, ‘‘50 ఏళ్లకు పెన్షన్ ఏది బాబూ?’’ ‘‘రెడ్బుక్ రాజ్యంగంతో అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు’’, ‘‘ఉచిత బస్సు తుస్సు, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అన్నావ్.. ఆడపడుచులనూ మోసం చేశావ్..’’ అంటూ ప్లకార్డులతో నినాదాలుచేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చి విజయంతం చేశారు.

జేబులు నింపుకోవడమే కూటమి కార్యక్రమం
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సరం పూర్తి అయినా ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కూటమి నేతల జేబులు నింపుకొనే కార్యక్రమం చేపట్టిందని ప్రదీప్ చింతా దుయ్యబట్టారు. వికలాంగుల పింఛను నుంచి రైతన్నలకు అందించే సాయం వరకు, మహిళలకు ఫ్రీ బస్సు నుంచి తల్లికి వందనం వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చక కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మలిరెడ్డి కిషోర్రెడ్డి మండిపడ్డారు.
ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమేనన్నారు.ఎన్నికల ప్రచార సభల్లో ఒకరికి ముగ్గురు చొప్పున బాబు, పవన్, పురందరేశ్వరి చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి ప్రజలను మోసం చేసి అధికారాన్ని చేపట్టి హామీలను నెరవేర్చకుండా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని చలపతి సర్ప విమర్శించారు. కార్యక్రమంలో చల్లా మధు సూదన్ యాదవ్, ప్రణయ్ గడిమే, ఆనంద్ అక్కి దాసు, రామిరెడ్డి జయచంద్రారెడ్డి, చలపతి గుర్ర, యశ్వంత్ గరికపాటి, సాయి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
అట్లాంటాలో వెన్నుపోటు దినం
సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు అమెరికాలోని అట్లాంటాలో బుధవారం వెన్నుపోటు దినం నిరసనను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ‘‘2019–24 మధ్య ఏ రంగంలోనైనా సమస్య ఏర్పడినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణం స్పందించింది.
నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి చురుగ్గా నడిపించారు. సమస్యలను పరిష్కరించే దాక విశ్రమించలేదు. కూటమి ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదు. ఎక్కడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం, వాటి పరిష్కారాన్ని చూపే ప్రయత్న చేయడం లేదు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు’’ అని విమర్శించారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.