
తేల్చుకోవాలన్న వైఎస్సార్సీపీ నేతలు
‘సాక్షి’పై దాడులు, రైతులపై అక్రమ కేసులు,
మహిళలపై అఘాయిత్యాలపై అదనపు డీజీకి ఫిర్యాదు
వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించాలని వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర డీజీపీ బాధితుల పక్షాన ఉంటారో, దాడులు చేసిన చేసిన వారి పక్షాన ఉంటారో తేల్చుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు అరుణ్కుమార్, వరుదు కళ్యాణి, ఇతర నేతలు స్పష్టంచేశారు. ఏపీలో అరాచక పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేయటానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు, పొదిలిలో రైతులపై అక్రమ కేసులు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం, మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలకు భద్రత కల్పించకపోవడం, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై వారు గురువారం అదనపు డీజీ మధుసూదనరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదనపు డీజీకి చాలా అంశాలపై ఫిర్యాదు చేశాం. దర్శిలో మా వారిపై టీడీపీ గూండాలు దాడి చేస్తే, మా వారిపైనే 15 అక్రమ కేసులు పెట్టారు. బాధితులకు కాకుండా టీడీపీ గూండాలకే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్ పర్యటనలకి ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించడంలేదు. జగన్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేసిన వారికి పోలీసులు అండగా నిలబడ్డారు.
పొదిలి, గుంటూరు, రామగిరి, తెనాలి ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనలో ప్రజలు భారీగా వచ్చినా, తగిన భద్రత కల్పించలేదు. ఇందులో లోకేశ్, టీడీపీ పాత్రపై విచారణ చేయాలి. జగన్ పర్యటనను అడ్డుకొనేందుకు వచ్చిన 40 మంది టీడీపీ మహిళా కార్యకర్తలకు మాత్రం 200 మంది పోలీసులను రక్షణగా పెట్టారు. మహిళలను ముందర పెట్టి విధ్వంసాలు సృష్టించి, జగన్ ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ కుట్ర చేస్తోంది.
ఇవే విషయాలను అడిషనల్ డీజీకి వివరించాం. వైఎస్సార్సీపీ వారిపై కొందరు పోలీసులు చేస్తున్న దాడులపైనా చర్యలు తీసుకోవాలని కోరాం’ అని చెప్పారు. వైఎస్ జగన్ పర్యటనలకు భద్రత విషయంలో ఎవరు ఆదేశిస్తే ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో పోలీసు అధికారులే చెప్పాలని అరుణ్ కుమార్ అన్నారు. అడిషనల్ డీజీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, ఏఎన్ఎన్ మూర్తి తదితరులు ఉన్నారు.