యూనివర్సిటీలు సామాజిక బాధ్యత పెంచే కేంద్రాలు | Universities are centers of social increase responsibility | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీలు సామాజిక బాధ్యత పెంచే కేంద్రాలు

Sep 10 2023 6:05 AM | Updated on Sep 10 2023 6:06 AM

Universities are centers of social increase responsibility - Sakshi

జీఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లికార్జునకు డాక్టరేట్‌ అందిస్తున్న గవర్నర్‌

సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్య­తను పెంచే కేంద్రాలుగా నిలుస్తున్నాయని ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఏయూ కట్టమంచి రామలింగారెడ్డి కాన్వొ­కేషన్‌ హాల్‌లో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి చాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమలు–శాస్త్ర రంగంలో జీఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లికార్జున, అవంతి ఫీడ్స్‌ సంస్థ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్, సాహిత్యం–కళా రంగాలలో ఎస్‌వీ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌లకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్‌ అందించారు.

690 మంది డాక్టరేట్లను, 600 మంది మెడల్స్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వ­రయ్య హాస్టల్, భారత్‌–ది జీ20 ప్రెసిడెన్షియ­ల్‌ హాస్టల్, శతాబ్ది క్లాసిక్‌ హాస్టల్‌ భవనాల్ని గవర్నర్‌ ప్రారంభించారు. అనంతరం గవర్నర్‌ నజీర్‌ మాట్లాడుతూ.. జ్ఞానం అంతఃదృష్టి కలిగి ఉండాలని, దాని­కి నైతికత జోడిస్తేనే విలువ ద్విగుణీకృతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నత విద్య జ్ఞాననిధిగా మారిందని.. దేశంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలుస్తోందని అన్నారు.

శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ విశ్వవిద్యాలయం సర్‌ సీఆర్‌ రెడ్డి, సర్వేపల్లి, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ వంటి వారి సారథ్యంలో ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఏయూ అమలు చేస్తున్న నూతన విధానాలను ఇతర విశ్వవిద్యాలయాలు సైతం అమలు చేస్తే ప్రతిభ కలిగిన యువతను దేశంలో స్థిరపడే విధంగా చేయడం సాధ్యమన్నారు. నాక్‌లో ప్రతిసారి అత్యుత్తమ గ్రేడ్‌ సాధించడం శుభపరిణామమని అభినందించారు. 

ఏయూ తెలుగు ప్రజలందరిదీ: బొత్స 
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ప్రజలందరిదీ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని.. విద్య కోసం ఏ రాష్ట్రం చేయనంత ఖర్చు చేస్తున్నామని వివరించా­రు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, నైపుణ్యా­లు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి, విద్యా నైపుణ్యం దిశగా ఏయూ అడుగులు వేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతకు అనుగుణంగా ఇంజినీరింగ్, సైన్స్, ఫార్మసీ రంగాల్లో ఆవిష్కరణలు జరిపే సౌలభ్యంతో కూడిన మౌలిక వసతులు కలి్పస్తూ ప్రోటో టైప్, కమర్షియలైజేషన్‌ దిశగా నడిపిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నెలకొలి్పన నాస్కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ 17 స్టార్టప్స్‌కు స్థానం కలి్పంచిందన్నారు. ఏయూ పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయుక్తంగా 54 ఎంఓయూలు చేసుకున్నట్టు చెప్పారు. ఏయూ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement