సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ కన్నారావు నాయుడు
రైతులందరం ఏకతాటిపై నిలిచి పోరాడుదాం
ఉండవల్లి రైతులతో డాక్టర్ కన్నారావు నాయుడు
బుజ్జగిస్తారు.. మనకు లాభం చేకూర్చినట్లు నటిస్తారు
వినకపోతే అనేక రకాలుగా బెదిరిస్తారు
మనం ఏమైనా అంటే దానిపై విష ప్రచారం చేస్తారు
అంగుళం భూమిని పోనివ్వకుండా పోరాడుదామని పిలుపు
తాడేపల్లి రూరల్: ‘రాజధాని గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం బుజ్జగింపులు, వేధింపులతో లోబరుచుకుంటోంది. తొలుత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, అధికారులను మన దగ్గరకు పంపించి బుజ్జగిస్తుంది. ఓ అధికారి మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లోపే ఆయన స్థానంలో మరో అధికారి వస్తారు. నాకు తెలియదని చెబుతారు. ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. అందుకని రైతులందరం ఒకేతాటిపై నిలిచి పోరాటం చేద్దాం’ అని రైతు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కన్నారావు నాయుడు అన్నారు.
ఈ నెల 9వ తేదీన మంగళవారం జరిగే గ్రామసభ సన్నాహాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఉండవల్లిలో రైతులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలో ఏం మాట్లాడాలి.. అధికారుల ప్రశ్నలకు ఏవిధమైన సమాధానాలు చెప్పాలి.. ఎలాంటి అభ్యంతరాలు తెలపాలనే విషయమై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఈశ్వర్రెడ్డి, మున్నంగి శ్రీధర్రెడ్డిలు మాట్లాడారు.
అనంతరం డాక్టర్ కన్నారావు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేని తనలాంటి వ్యక్తులను కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్లు అసభ్యంగా పోస్టులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..
రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తగ్గిస్తారు..
‘అధికారులు మన భూములు తీసుకునేందుకు మొదట బుజ్జగించారు. కొంతమంది రైతులు వారికి సహకరించారు. అయినా వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. పంట పండించే రైతుకు రాజకీయ నాయకుల, అధికారుల రాజకీయం తెలియదు. మనపై ప్రేమ ఉన్నట్లు రాజధానిలో ఎక్కడా లేని విధంగా భూముల రేట్లు పెంచి మన భూములు తీసుకుంటారు. ఇక్కడే అసలు రాజకీయం ఉంది. కొన్న భూమిని అతి తక్కువ వ్యాల్యూతో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. దీంతో గ్రామంలోని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
మనందరం మన భూమిని అమ్ముకోవడంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తగ్గిస్తే గ్రామాన్ని నాశం చేసినట్లే. 1995 నుంచే మన భూములకు ఎక్కువ విలువ ఉంది. తాడేపల్లి భూముల కన్నా మన భూముల రేట్లే ఎక్కువ. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా న్యాయస్థానాల్లో మనకు న్యాయం లభిస్తుంది. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం గ్రామంలో సామాజిక సర్వే జరపాల్సి ఉంది. దాన్ని సైతం క్రాస్ చేసి.. అధికారులు వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నింటిపై ఒకేసారి గ్రామసభ నిర్వహించకూడదు. కానీ, అధికారులు విడివిడిగా జరిపినట్లు రాసుకుంటారు.
వీటన్నింటిని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. మన భూమి అంగుళం కూడా పోకుండా పోరాటం నిర్వహిస్తే మన ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది’ అని కన్నారావు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రైతులు దంటు బాలాజీరెడ్డి, పల్లపోలు అశోక్రెడ్డి, ఉప్పు రవి, కళ్లం సాంబిరెడ్డి, శిగిరిశెట్టి రత్నబాబు, శింగంశెట్టి రాంబాబు, పెన్నేరు కోటేశ్వరరావు, గుర్రాల గోపాలరావు, పెన్నేరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


