ఆంధ్రప్రదేశ్‌ ‘సచివాలయ’ ఉద్యోగులకు బొనాంజా..

Two types pay scales to Village and Ward Secretariat employees With PRC - Sakshi

కొత్త పీఆర్సీలో వారికి రెండు రకాల పే స్కేల్స్‌

నిబంధనల ప్రకారం అయితే కొత్త పీఆర్సీ వీరికి వర్తించదు..

ప్రస్తుతం ప్రభుత్వంలో వీరి పాత్రే కీలకం

అందుకే వారికీ కొత్త పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫారసు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ ప్రకటించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటు నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమలులో లేదని..  ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈ పీఆర్సీ ‘సచివాలయా’ల ఉద్యోగులకు వర్తించే అవకాశం లేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

అయితే, ప్రస్తుతం ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ సమయంలో వారిని వదిలి వేయడం సబబు కాదన్న ఉద్దేశంతో తుదకు ఆయా ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ సిఫార్సులను వర్తింపజేయాలన్న ప్రతిపాదన చేస్తున్నట్టు కమిటీ తన నివేదికలో పేర్కొంది. ప్రొబేషనరీ ప్రకటన అనంతరం ‘సచివాలయ’ ఉద్యోగులకు  కొత్త పీఆర్సీ అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై ఏడాదికి  రూ. 1,800 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో వివరించింది. 

19 రకాల క్యాడర్‌ ఉద్యోగులకు రెండు రకాల పే స్కేల్‌ నిర్ణయం...
► గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు రూ. 15,030 కనిష్టంగా పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది.

► గ్రామ సచివాలయాల్లో పనిచేసే మిగిలిన డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, గ్రేడ్‌–2 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, సెరికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ సర్వేయర్, వీఆర్వో, వేల్ఫ్‌ర్‌ అసిస్టెంట్లకు రూ. 14,600 కనిష్ట పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. (చదవండి: ఆర్టీసీలో అదృష్టవంతులు)

► వార్డు సచివాలయాల్లో పనిచేసే వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీకి రూ. 15,030 కనిష్ట పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. మిగిలిన వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌–డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వెల్ఫ్‌ర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలకు రూ. 14,600 కనిష్టంగా పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పేర్కొంది. (చదవండి: ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు)

సలాం సీఎం సర్‌
11వ పీఆర్సీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానం కల్పించడం అత్యంత గొప్ప విషయం. రూ.1,800 కోట్ల ఆర్థిక భారాన్ని సైతం ఖాతరు చేయకుండా ఉద్యోగులకు మేలు చేయాలన్న ఆలోచన చరిత్రాత్మకం. సీఎం జగన్‌ 15,004 సచివాలయాల ద్వారా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి జీవితంలో మరువలేని మేలు చేశారు. సచివాలయ ఉద్యోగులపై చిన్నచూపు చూసిన రాజకీయ పక్షాలకు ప్రభుత్వ ప్రకటన చెంపపెట్టు. ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని సచివాలయ ఉద్యోగులు నిలబెట్టుకుంటారు.
– ఎండీ జానీపాషా, అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top