
మర్రిపూడి, ఒంగోలు: స్థానిక విద్యాశాఖ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ కోలా రాజశేఖర్ (35) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ నెల 18న ఆయన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్నాథం జయసింహగా కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వత్ వెల్లడించారు. బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. రాజశేఖర్ గే. ఆయనకు పొదిలికి చెందిన జగన్నాథం జయసింహతో ఏడాదిన్నర నుంచి స్వలింగ సంపర్క సంబంధం ఉంది.
తొలుత ఎవరికీ తెలియకుండా ఇద్దరూ సంబంధం కొనసాగించారు. కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించిన జయసింహ ఒంగోలులో ఫిషరీస్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ చెడు అలవాట్లకు బానిసై ఉద్యోగం మానేశాడు. చెడుతిరుగుళ్లు తిరుగుతూ దర్శికి చెందిన వివాహిత పల్లా అనూషాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది రాజశేఖర్కు నచ్చలేదు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. రాజశేఖర్ను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన జయసింహ తనతో చనువుగా మెలుగుతున్న అనూషాతో కలిసి హత్యకు పథకం రచించాడు.
చివరిగా ఒకసారి తనతో శారీరకంగా కలిస్తే వాట్సప్ గ్రూపులో అసభ్యకర పోస్టులు పెట్టనని జయసింహతో రాజశేఖర్ చెప్పాడు. ఈ నెల 18వ తేదీ బుధవారం ఉదయం ఇంటి నుంచి బైక్పై రాజశేఖర్ బయటకు వచ్చాడు. అనంతరం బస్టాండ్ సెంటర్లో అల్పాహారం పార్శిల్ చేయించుకుని శ్రీలక్ష్మీనృంహస్వామి కొండ వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ జయసింహ, అనూష ఉన్నారు. కాసేపటికే వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు చోటుచేసుకుంది. రాజశేఖర్ను కింద పడేసి అతి కిరాతకంగా కారుతో ఢీకొట్టి చంపారు. ఈ దాడిలో రాజశేఖర్ మర్మాయవాలు తెగిపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత హంతకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతుడి ఫోన్కు చివరిగా వచ్చిన కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికతను ఉపయోగించి కేసును ఛేదించారు. హంతకులను పొదిలి కొండ సమీపంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో కొండపి సీఐ సోమశేఖర్, మర్రిపూడి ఎస్సై రమేష్బాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.