
తిరుమలలో నిరంతరంగా సాగుతున్న టీటీడీ అన్నప్రసాద వితరణ...
దాత రూ.44 లక్షలు విరాళమిస్తే రోజంతా అన్నప్రసాదాల పంపిణీ
తిరుమల వెంగమాంబ సత్రంలో డిస్ప్లే బోర్డులో పేరు ప్రదర్శన
రోజుకు 2.5 లక్షల మందికి వితరణ చేస్తున్న టీటీడీ
భక్తుల కోరిక తీర్చడమే కాదు.. తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి..తిరుమల వేంకటేశ్వరుడు.. ఆ దేవదేవుడే ఆదేశించినట్లుగా ప్రతిరోజు తిరుమలలో అన్నప్రసాదవితరణ మహాయజ్ఞంలా సాగుతోంది....
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టీటీడీ ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది.
ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజుల్లో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు.
భక్తుల నుంచి విశేష ఆదరణ
దాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ– 2, పీఏసీ – 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు.
ప్రతి రోజూ టీటీడీలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుంచి టీటీడీ అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది.
దాతలు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించే అవకాశం
రూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.