
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్ అయ్యాయి. ఈ విష వాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారికి స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని ఎస్ ఎస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయ్యాయి. విష వాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులను చంద్రశేఖర్, కుమార్గా గుర్తించారు. విష వాయువు కారణంగా పలువురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో, కంపెనీ యాజమాన్యం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే, ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. పరవాడ సీఐ మల్లికార్జునరావు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. పరవాడ ఫార్మా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కేజీహెచ్లో పరామర్శించారు వైఎస్సార్సీపీ నాయకులు బొడ్డేడ ప్రసాద్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పరవాడ ఫార్మా కంపెనీల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా కంపెనీలపై అధికారుల నియంత్రణ కొరవడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. కార్మికులంటే ప్రభుత్వానికి లెక్కలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
