మహారాణిపేట: బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశం–2026కు పటిష్ట భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 22, 23 తేదీల్లో నోవోటెల్లో సమావేశం జరుగుతుందని, 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్రతినిధులు 21 నుంచి 24 వరకు నగరంలో ఉంటారని చెప్పారు. అతిథులకు రాడిసన్ బ్లూ, నోవోటెల్లో వసతి, భద్రత, రవాణా, ప్రోటోకాల్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. 22న గాలా డిన్నర్, 23న బీచ్లో సైకిల్ ర్యాలీ, కై లాసగిరిలో గ్లాస్ బ్రిడ్జి సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమాలతోపాటు తొట్లకొండ, రుషికొండలో పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీ మణికంఠ, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


