సీతాకోకచిలుక మనుగడకు ముప్పు! | Threat to butterfly survival revels in survey | Sakshi
Sakshi News home page

సీతాకోకచిలుక మనుగడకు ముప్పు!

Apr 9 2025 5:41 AM | Updated on Apr 9 2025 5:41 AM

Threat to butterfly survival revels in survey

వాతావరణ మార్పులతో దేశంలో తగ్గిపోతున్న వాటి జాతులు

మన రాష్ట్రంలోనూ గతంలో 273 జాతుల గుర్తింపు 

ఇప్పడు వాటిలో కొన్ని కనిపించడం లేదంటున్న పర్యావరణవేత్తలు  

పాపికొండలు, నల్లమల, శేషాచలం వంటి ప్రాంతాల్లో తగ్గుతున్న 

సీతాకోక చిలుకలు.. జీఎస్‌ఐతోపాటు పలు సర్వేల్లో గుర్తింపు  

సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యంలో అతి ముఖ్యమైన సీతాకోకచిలుకలు వాతావరణ మార్పుల వల్ల తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతం తగ్గడం కారణంగా అవి మనుగడ సాగించలేకపోతున్నాయి. క్రమంగా వాటి జాతుల సంఖ్య తగ్గిపోతోంది. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)తోపాటు పర్యావరణవేత్తలు, పలు సంస్థలు చేపట్టిన సర్వేల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని విభిన్నమైన భౌగోళిక ప్రాంతాలైన తూర్పు కనుమలు, నల్లమల అడవులు, శేషాచలం కొండలు, పాపికొండలు అభయారణ్యం సీతాకోకచిలుకలకు అనువుగా ఉండేవి. 

ఇవికాకుండా సాధారణ జాతులు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. రాష్ట్రంలో 273 జాతుల సీతాకోకచిలుకలు ఉన్నట్లు గతంలో గుర్తించారు. వాటిలో పాపిలియోనిడే, హెస్పెరిడే, పిరిడే వంటి జాతులు ముఖ్యమైనవి. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లోనే 190 సీతాకోకచిలుకల జాతులను గుర్తించారు. పాపికొండలు నేషనల్‌ పార్క్‌లో కామన్‌ మోర్మన్, బ్లూ టైగర్‌ వంటి అరుదైన జాతులు కనిపిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అడవుల్లో ‘పీకాక్‌ పాన్సీ’ వంటి రంగురంగుల సీతాకోకచిలుకలు విహరిస్తున్నాయి.  

ఆహార గొలుసు దెబ్బతింటుంది!  
సీతాకోకచిలుకలు పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. పువ్వుల నుంచి తేనె తీసుకుంటూ పరాగ సంపర్కానికి దోహదపడతాయి. పూలు, పండ్ల తోటలు సీతాకోకచిలుకల సహాయంతో మెరుగైన దిగుబడిని ఇస్తాయి. అవి లేకపోవడం వల్ల ప్రధానంగా ఉద్యాన పంటల ఉత్పత్తి తగ్గి, ఆహార భద్రతపై ప్రభావం పడుతుంది. అదేవిధంగా పక్షులు, బల్లులకు సీతాకోకచిలుకలు ఆహార వనరుగా ఉపయోగపడతాయి. వాటి సంఖ్య తగ్గితే నల్లమల, శేషాచలంలోని ఇతర పక్షి జనాభా ప్రభావితమై ఆహార గొలుసు దెబ్బతింటుంది. 

ఉష్ణోగ్రత పెరుగుదలే కారణం..
» సీతాకోకచిలుకల జీవనచక్రం రెండు నుంచి నాలుగు వారాలు మాత్రమే. వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం వంటి మార్పులు వాటిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం, అడవులను నరికివేయడం వల్ల సీతాకోకచిలుకల ఆవాసాలు దెబ్బతింటున్నాయి.  
»   రాష్ట్రంలో కొన్నేళ్లుగా అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సీతాకోకచిలుకల గుడ్లు, లార్వా పెరుగుదలను దెబ్బతీస్తున్నాయి. 
»   వేసవికాలంలో నల్లమల అడవుల్లో అధిక వేడి వల్ల కొన్ని సీతాకోకచిలుక జాతులు కనుమరుగైనట్లు పరిశోధకులు గుర్తించారు. 
» తూర్పు కనుమల్లో అడవుల నరికివేత, గనుల తవ్వకం, పట్టణీకరణ కారణంగా సీతాకోకచిలుకలకు అవసరమైన మొక్కలు కనుమరుగవుతున్నాయి. 
»  శేషాచలం కొండల్లో రోడ్ల నిర్మాణం, అటవీ భూముల స్థల మార్పిడి వల్ల వీటి ఆవాసాలు తగ్గిపోతున్నాయి. 
»వర్షపాతాల్లో వస్తున్న మార్పులు కూడా సీతాకోకచిలుకలకు ఇబ్బందికరంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని చోట్ల వరదలు సీతాకోకచిలుకల జీవన చక్రానికి ఆటంకం కలిగిస్తున్నాయి.  
» విశాఖపట్నం సమీపంలోని అరకు లోయలో వర్షాభావం వల్ల కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి.  

ఆరోగ్యకరమైన పర్యావరణానికి సూచికలు 
సీతాకోకచిలుకలు ఆరోగ్యకరమైన పర్యావరణానికి సూచికలు. వాటి సంఖ్య తగ్గడం అంటే కాలుష్యం, అడవుల నాశనం పెరిగి పర్యావరణం దెబ్బతింటున్నట్లు అర్థం చేసుకోవాలని పర్యావరణవేత్త, వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ జిమ్మీకార్టర్‌ పొలిమాటి తెలిపారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్థానిక సంఘాలు కలిసి పనిచేస్తూ ఇప్పటికే వాటి సంరక్షణకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల సీతాకోక చిలుకలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకొని, వాటిని కాపాడేందుకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.  

అడవుల సంరక్షణ, కర్బన ఉద్గారాల నియంత్రణ అవసరం
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో అస్థిరతలు, అడవుల నిర్మూలన వంటి వాటివల్ల సీతాకోక చిలుకల సహజ ఆవాసాలు తగ్గిపోతు­న్నాయి. సీతాకోకచిలుకలు తమ జీవన చక్రంలో నిర్దిష్ట వాతావరణ పరిస్థితులపై ఆధారపడతాయి. ముఖ్యంగా గుడ్లు పెట్టడం, లార్వా దశలో ఆహార మొక్కల లభ్యత కోసం అవసరం. ఈ పరిస్థితులు మారిపోతే వాటి పునరుత్పత్తి రేటు తగ్గుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి అడవుల సంరక్షణ, కర్బన ఉద్గారాలను నియంత్రించడం అత్యవసరం.– జిమ్మీ కార్టర్, వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్, పర్యావరణవేత్త, తూర్పు గోదావరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement