వడగాడ్పులు.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు | Thousands of chickens die every day due to the heat | Sakshi
Sakshi News home page

వడగాడ్పులు.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు

Jun 11 2025 2:09 AM | Updated on Jun 11 2025 2:09 AM

Thousands of chickens die every day due to the heat

రోజూ వేల సంఖ్యలో మృత్యువాత

గుడ్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం  

తడిసి మోపెడవుతున్న నిర్వహణ భారం  

నేటికీ అందని బర్డ్‌ ఫ్లూ పరిహారం  

ఇలాగైతే కష్టమే అంటున్న రైతులు

కొద్ది రోజులుగా మండుతున్న ఎండలు పౌల్ట్రీకి గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. 3 నెలల క్రితం బర్డ్‌ ఫ్లూ దెబ్బతో కుదేలైన కోళ్ల పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం అందించలేదు. మరోపక్క మండుతున్న ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుండటం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. 

ఉమ్మడి పశ్చి­మ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లోని 200 పౌల్ట్రీల్లో 1.3 కోట్ల వరకు లేయర్‌ కోళ్లు ఉన్నాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీ ఫారంలో సాధారణంగా రోజుకు 50–60 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. 

వారం రోజులుగా ఎండలు ఎక్కువై, వడగాడ్పుల తీవ్రతతో కోళ్ల మరణాలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఈ విధంగా రోజుకు 39,000 కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు అంచనా. ఒక కోడి చనిపోతే రూ.250 వరకు నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రూ.97.50 లక్షల నష్టం వాటిల్లుతోంది. గత వారం రోజుల్లో జిల్లాలోని పౌల్ట్రీకి రూ.6.83 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. – సాక్షి, భీమవరం

తగ్గిపోయిన గుడ్ల ఉత్పత్తి...
ఎండల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో జిల్లాలో రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాడ్పుల తీవ్రతకు అది 94.50 లక్షలకు తగ్గిపోయింది. డ్రాపింగ్‌ వల్ల రోజుకు 10.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఫాంగేట్‌ వద్ద గుడ్డు రైతు ధర రూ.5.35 ఉండగా రోజుకు రూ.56.17 లక్షలు చొప్పున వారం రోజుల్లో రూ.3.93 కోట్లు నష్టపోయినట్టు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

పెరిగిన నిర్వహణ భారం
అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులు చెబుతున్నారు. వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు షెడ్ల చుట్టూ గోనె సంచులు కట్టి నీటితో తడపడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లతో నిర్వహణ భారం పెరిగిపోతోందని తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో వెలుగుచూసిన బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కోళ్ల రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వైరస్‌ను గుర్తించక ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల వరకు లేయర్‌ కోళ్లు మృతి చెందినట్లు అంచనా. వైరస్‌ గుర్తించాక వేల్పూరు ఇన్ఫెక్షన్‌ జోన్‌లోని 55 వేలు, బాదంపూడి ఇన్ఫెక్షన్‌ జోన్‌లోని 1.34 లక్షల లేయర్‌ కోళ్లను కల్లింగ్‌ చేశారు. గుడ్లు, మేతను పూడ్చిపెట్టారు. వైరస్‌ కట్టడిలో భాగంగా ఆంక్షలు అమలు చేయడంతో వినియోగం తగ్గి ఫాంగేట్‌ వద్ద గుడ్డు ధర రూ.4.10కు పడిపోయింది.  

ఒక్కో కోడికి రూ.140 నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కగట్టారు. ఈ మేరకు పూడ్చిపెట్టిన కోళ్లకు గాను రూ.2.65 కోట్లు, గుడ్లు, మేత రూపంలో మరింత మొత్తం బాధిత రైతులకు అందించాల్సి ఉంది. 3 నెలలైనా ప్రభుత్వం ఇప్పటివరకు వారికి పరిహారం అందించలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన ఇప్పుడు ఎండలు పౌల్ట్రీకి నష్టం కలిగిస్తున్నాయి. 

ప్రభుత్వం నుంచి బర్డ్‌ ఫ్లూ పరిహారం రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే తాము మరింతగా నష్టాల్లో కూరుకుపోతామని రైతులు, పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.  వాస్తవ పరిస్థితులు పరిశీలించి ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement