రెండేళ్ల వెన్నుపోటుకు నిరసన తెలిపి వస్తుండగా అడ్డగించి కొట్టిన వైనం
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి ఇంటి సమీపంలోనే రెచ్చిపోయిన మూక
పోలీసుల ఎదుటే తుఫాన్ వాహనం, మోటారు సైకిల్ దహనం
ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు..
మంత్రాలయం మండలం మాధవరంలో తీవ్ర ఉద్రిక్తత
మంత్రాలయం: వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విజయవంతం కావడాన్ని జీరి్ణంచుకోలేక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ మూకలు వీరంగం వేశాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెలగబడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను గాయపరిచారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి ఇంటి సమీపంలో పోలీసుల ఎదుటే తుఫాను వాహనాన్ని, మోటారు సైకిల్ను తగులబెట్టారు. మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన చేపట్టారు.
కోసిగి మండల కేంద్రంలో జరిగిన నిరసనకు మంత్రాలయం మండలం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివెళ్లారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి ఇంటిముందు రహదారి మీదుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా వెళ్లారు. కోసిగిలో జరిగిన ఈ నిరసనకు అనూహ్య స్పందన లభించింది. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక రాఘవేంద్రరెడ్డి వర్గీయులు అక్కసు వెళ్లగక్కారు. నిరసన ముగించుకుని తిరిగి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాఘవేంద్రరెడ్డి ఇంటి ముంగిట పోలీసుల కళ్లెదుటే దాడికి పాల్పడ్డారు.
ముందుగా సూగూరు గ్రామానికి చెందిన దేవదాసు, లక్ష్మీరెడ్డి బైకును అడ్డగించి దాడిచేశారు. పోలీసులు కలుగజేసుకుని టీడీపీ మూకల నుంచి తప్పించి వారిని గ్రామంలోని స్టేషన్కు తరలించారు. తరువాత టీడీపీ గూండాలు అదేదారిలో వస్తున్న వైఎస్సార్సీపీ తుఫాన్ వాహనంపై విరుచుకుపడ్డారు. అందులోని కార్యకర్తల మీద, ఆ వెనుక బైక్పై వస్తున్న మరో ఇద్దరిపైన దాడిచేశారు. ఈ దాడుల్లో బూదూరుకు చెందిన పూజారి ఈరన్న, సూగూరు వాసి గొల్ల అంజినప్ప, 52–బసాపురం గ్రామస్తుడు గొల్ల రాముడు గాయపడ్డారు. వీరు ముగ్గురు ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బసాపురం గ్రామానికి చెందిన కుమ్మరి అల్లయ్య, మోరి డొంకయ్య, మేకల ప్రహ్లాద, శివ, కురువ నవీన్ బైక్లపై వస్తుండగా టీడీపీ వర్గీయులు వెంబడించారు. బూదూరుకు చెందిన పెద్ద నాగప్ప మోటార్ సైకిల్ను, నారాయణపురానికి చెందిన చిన్నబాబు తుఫాన్ వాహనాన్ని తగులబెట్టారు. ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అడ్డగించిన పోలీసులు
నిరసన ముగించుకుని స్వగ్రామం రాంపురానికి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, అనుచరుల వాహనాలను పోలీసులు కోసిగిలో అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి వెళ్లకుండా ఆయన వాహనాన్ని రాంపురం అడ్డరోడ్డులో నిలిపేశారు.
వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయుల దాడి
మాచర్ల ర్యాలీకి వెళ్లినందుకే దాడి చేశారని బాధితుడి ఆవేదన
బాధితుడిని పరామర్శించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు పీఆర్కే
రెంటచింతల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( పీఆర్కే) ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న మంచికల్లు వైఎస్సార్సీపీ నాయకుడు పాశం వెంకటరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. వెంకటరెడ్డిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు.
కాగా దాడి విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి గౌతమ్రెడ్డి మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వెంకటరెడ్డిని పరామర్శించారు. బాధితుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ ర్యాలీకి వెళ్లి వచ్చి సెంటర్లో కూర్చున్న తనపై ర్యాలీకి ఎందుకు వెళ్లావు...నీవు గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గోగుల వెంకటరామిరెడ్డి, గోగుల లక్ష్మారెడ్డి, గోగుల పున్నారెడ్డి, గోగుల మహేష్ రెడ్డి కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు.


