
సీటు విషయంలో ఎమ్మెల్యే, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ల మధ్య పోటీ
తమ వర్గానికి సీటు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహం
ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించి ప్రిన్సిపాల్కు బెదిరింపు
గుండెపోటు, ఫిట్స్తో స్పృహ తప్పి పడిపోయిన ప్రిన్సిపాల్
(అనకాపల్లి జిల్లా)బుచ్చెయ్యపేట: కూటమి నేతల పంతాలు, పట్టింపులు అధికారుల ప్రాణం మీదకు తెస్తున్నాయి. ఎమ్మెల్యే తన వర్గీయులకు సీటు ఇవ్వలేదని ప్రిన్సిపాల్ను తన కార్యాలయానికి పిలిపించి బెదిరించగా.. ప్రిన్సిపాల్ అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో శుక్రవారం జరిగింది. బుచ్చెయ్యపేట మండలంలోని వడ్డాది కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతిలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ సీటు కోసం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు వర్గం, రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు(టీడీపీ నేత) వర్గం పోటీ పడ్డాయి.
ఇరువర్గీయులు ప్రిన్సిపాల్ కె.అన్నపూర్ణపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే చివరికి ప్రిన్సిపాల్ తాతయ్యబాబు వర్గం సూచించిన బాలికకు సీటు కేటాయించారు. తమ మాట చెల్లకపోవడంతో ఎమ్మెల్యే రాజు వర్గీయుడు గురువారం కేజీబీవీకి వెళ్లి ప్రిన్సిపాల్ను బెదిరించాడు. ‘ఎమ్మెల్యే చెప్పిన వారికి సీటు ఇవ్వవా.. నీవు ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాం. స్కూల్ గేటు ఎలా దాటతావో చూస్తాం’ అంటూ బెదిరింపులకు దిగాడు. అనంతరం ఆమెను ఎమ్మెల్యే కార్యాలయానికి రప్పించారు.
‘ఎవరి ప్రోద్బలంతో ఆ సీటును కేటాయించారు? ఎమ్మెల్యే అంటే లెక్కలేదా’ అంటూ ఎమ్మెల్యేతో సహా కూటమి నాయకులు బెదిరించడంతో ఆమె ప్రాణభయంతో గుండెపోటు, ఫిట్స్తో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ భర్త కామేశ్వరరావు ఆస్పత్రికి చేరుకుని కూటమి నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.