
రాజధాని టెండర్లలో మరో లాలూ‘ఛీ’ పర్వం
ఐకానిక్ టవర్లూ సిండి‘కేటు’కే
మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచిన సీఆర్డీఏ
2018లో దక్కించుకున్న సంస్థలకే వాటిని మళ్లీ కట్టబెట్టేలా చక్రం తిప్పిన ముఖ్యనేత
ఎన్సీసీ, షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి మాత్రమే బిడ్లు
కాంట్రాక్టు విలువ కంటే 4.49, 4.50, 4.57 శాతం అధిక ధరలకు పనులు చేజిక్కించుకున్న సంస్థలు
ఖజానాపై రూ.159 కోట్లకుపైగా భారం
జీఏడీ టవర్ నిర్మాణ పనులను రూ.882 కోట్లకు దక్కించుకున్న ఎన్సీసీ
జీఎస్టీ, ఇతర పన్నులతో కలిపి జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,045.60 కోట్లు
2018లో ఇదే పనులు రూ.554.06 కోట్లకు ఎన్సీసీకి అప్పగింత
టవర్–1, 2 పనులను 1,487 కోట్లకు చేజిక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ
జీఎస్టీ, ఇతర పన్నులతో కలిపి టవర్–1, 2 కాంట్రాక్టు విలువ రూ.1,762.70 కోట్లు
2018లో ఇవే పనులు రూ.932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీకి అప్పగింత
టవర్–3, 4 పనులను రూ.1,304 కోట్లకు దక్కించుకున్న ఎల్ అండ్ టీ
జీఎస్టీ, ఇతర పన్నులతో కలిపి టవర్–3, 4 కాంట్రాక్టు విలువ రూ.1,545.70 కోట్లు
2018లో ఇవే పనులను రూ.784.62 కోట్లకు ఎల్ అండ్ టీకి అప్పగింత
రాజధాని ప్రాంతంలో ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేయడమే కాకుండా.. ఆ పనులను పాత ‘సిండికేట్’ సంస్థలకే కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ చక్రం తిప్పారు. అంచనా వ్యయాలను విపరీతంగా పెంచేయడంతోపాటు పాత కాంట్రాక్టు సంస్థలనే తెరపైకి తెచ్చి.. పోటీదారులు లేకుండా పక్కా వ్యూహ రచన చేశారు. నచ్చిన సంస్థలకే అధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి భారీ దోపిడీకి తెరలేపారు.
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో సిండి‘కేటు’ లాలూ‘ఛీ’ పర్వం ఐకానిక్ టవర్ల టెండర్ల సాక్షిగా మరోసారి బట్టబయలైంది. మూడు ప్యాకేజీల కింద ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఆ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే.. 2018లో ఆ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకే ఇప్పుడూ కట్టబెట్టేలా ‘ముఖ్యనేత’ పథకం పన్నారు. తద్వారా పాత సంస్థలకే మూడు ప్యాకేజీలను అధిక (ఎక్సెస్) ధరకు కట్టబెడుతూ సీఆర్డీఏ సోమవారం ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.159 కోట్ల భారం పడుతుంది.
ఆ మేరకు ఖజానాను కాంట్రాక్టు సంస్థలకు దోచిపెట్టి నీకింత.. నాకింత అంటూ పంచుకుతినడానికి ముఖ్యనేత సిద్ధమయ్యారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్–జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులకు టెండర్లు పిలిచి 2018 ఏప్రిల్లోనే కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.
మూడు ప్యాకేజీలకూ మూడు సంస్థలే
⇒ సచివాలయం 1, 2 ఐకానిక్ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 ఐకానిక్ టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ ఐకానిక్ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది.
⇒ ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకూ ముఖ్యనేత ఏర్పాటుచేసిన సిండికేటులోని ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి.
⇒ 1, 2 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.70 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఇదే షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.24 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.
3, 4 ఐకానిక్ టవర్లు నిర్మాణంలోనూ ఇలా..
3, 4 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 4.57 శాతం అధిక ధరకు అంటే రూ.1,304 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది.
జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.7 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.761.08 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.
జీఏడీ టవర్ పనులూ అధిక ధరకే..
జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.49 శాతం అధిక ధరకు అంటే రూ.882 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,045.6 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఇదే ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్ కాంట్రాక్టు వ్యయం రూ.491.54 కోట్లు పెరిగింది.
అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలా
ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ఇదే ఐకానిక్ టవర్ల పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది.
ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,082.86 కోట్లు పెరిగింది. ఐదు ఐకానిక్ టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని చదరపు అడుగు రూ.8,340.20 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకుతినేలా కుట్ర పన్నడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసిమోపెడు
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు.
ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసి సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఐటీ శాఖకు అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.