
సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి.. ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టని కూటమి ప్రభుత్వం
సూపర్ సిక్స్ అమలు చేయకుండా ఇప్పటికే రూ.81,397.83 కోట్లు ఎగ్గొట్టిన సర్కార్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు, మహిళలకు నమ్మకద్రోహం.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఉద్యోగులకు ఐఆర్ లేదు.. నాలుగు డీఏలు పెండింగ్
పేదలకు ఒక్క ఇల్లు కట్టింటే ఒట్టు.. కాపులకూ మొండిచేయి
ఆరోగ్యశ్రీని నీరుగార్చేసి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన దుస్థితి
పంటలకు గిట్టుబాటు ధర దక్కక రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళన.. పెంచం అంటూనే విద్యుత్ చార్జీల బాదుడు.. రూ.15,485 కోట్ల భారం
మేనిఫెస్టోను మోసఫెస్టోగా మార్చారంటూ ప్రజల ఆగ్రహం
ఏడాదిలో ఏమీ చేయకపోగా సంబరాలకు సిద్ధం
జగన్ సర్కార్ తొలి ఏడాదిలోనే 95% హామీలు అమలు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు అంతకంటే రెండింతలు అధికంగా సంక్షేమం అందిస్తామని వాగ్దానం చేశారు. వాటిని నమ్మిన ప్రజానీకం ఓట్లేసి టీడీపీ కూటమిని గెలిపించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా మేనిఫెస్టో అమలుపై దృష్టి పెట్టడం లేదు. పైగా సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేసేశామని.. కాదూ కూడదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారికి నాలుక మందం తప్ప మరొకటి కాదంటూ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోకు నాటి సీఎం వైఎస్ జగన్ సిసలైన నిర్వచనం చెప్పారని ప్రశంసిస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చాక, మద్య నిషేధాన్ని ఎత్తేయడం.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్ర లేపడమేనని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ప్రజలను జాగృతం చేశారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
వైఎస్ జగన్ చెప్పినట్లే.. ఎన్నికల మేనిఫెస్టోను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారని, హామీల అమలు పూచీ నాదంటూ గ్యారంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వాటిపై నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయక పోవడం ద్వారా ఏడాదిలోనే ప్రజలకు రూ.81,397.83 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. మిగతా హామీలను తుంగలో తొక్కడం ద్వారా అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారని ప్రజానీకం మండిపడుతోంది. ఏడాదిలో ఏమీ చేయకపోగా, ఎంతో చేసేసినట్లు సంబరాలకు సిద్ధమవడాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.
బీసీలకు వెన్నుపోటు
⇒ బీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు.. ఆ వర్గాల ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి వెన్నుపోటు పొడిచారు. బీసీ వర్గాల ప్రజల స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.పది వేల కోట్లు వ్యయం చేస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున స్వయం ఉపాధికి వ్యయం చేయాలి. కానీ.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
⇒ రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన ఈ పథకానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేయాలి. కానీ..ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
⇒ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి దాకా అమలు చేయలేదు. పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారే గానీ అమలు చేయలేదు.
⇒ నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని అమలు చేయలేదు. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.25 వేలు ఇస్తామన్న హామీని గాలికి వదిలేశారు.
⇒ వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్.. రాయల్టీ, సీనరేజీ చార్జీల్లో మినహాయింపు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదు. రజకులకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహకం, విద్యుత్ చార్జీల రాయితీ ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.
⇒ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది ఆ సాయం అందించకుండా రూ.265 కోట్లు ఎగ్గొటా్టరు. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.
మహిళలకు మోసం
⇒ 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, చేయకుండా మహిళలకు మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో వంచించారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ.. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
⇒ అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని, ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు.
⇒ ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని, విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు ఇస్తామని.. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తామంటూ ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా అమలు చేయలేదు.
ఎస్సీ, ఎస్టీలకు నమ్మకద్రోహం
ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తోంది. సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని నమ్మబలికి.. వాటిని ఇతర పనులకు మళ్లిస్తూ అన్యాయం చేస్తోంది. చివరకు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడమే అందుకు నిదర్శనం.
రైతులకు తీరని ద్రోహం
వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో హామీ ఇచ్చి వాటిని మాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో అన్నదాతలకు ద్రోహం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. వరి నుంచి కోకో వరకూ ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైతు భరోసాగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామని ప్రకటించి మొదటి ఏడాది రూ.10,716.53 కోట్లు్ల ఎగ్గొట్టారు.
ఉద్యోగులకూ మోసం
సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని 2014లో హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడూ అదే రీతిలో ద్రోహం చేస్తున్నారు. మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ చైర్మన్ను రాజీనామా చేయించారు. ఇప్పటికీ తిరిగి చైర్మన్ను నియమించలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటిదాకా ఐఆర్ ఊసే లేదు. అలవెన్స్ పేమెంట్స్పైన కూడా పునఃపరిశీలన చేస్తామని హామీ ఇచ్చి, నాలుగు డీఏలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. వెరసి ఉద్యోగులకు రూ.20 వేల కోట్లకుపైగా బకాయిపడ్డారు.
⇒ వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థనే రద్దు చేసి 2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేసి వారికి ద్రోహం చేశారు.
కాపులకు రూ.3 వేల కోట్లు బకాయి
⇒ కాపు సామాజిక వర్గంపై చంద్రబాబుది కపట ప్రేమేనన్నది మరోసారి స్పష్టమైంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపు సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో కనీసంగా రూ.15 వేల కోట్లు నిధులు కేటాయించి.. కాపుల సాధికారత, అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్లు చొప్పున ఖర్చు చేయాలి.
కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అంటే.. ఇప్పటికే కాపులకు రూ.3 వేల కోట్లు బకాయిపడ్డారు. 2025–26 బడ్జెట్లోనూ కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఇచ్చిన హామీకి దిక్కే లేదు.
ముస్లిం మైనార్టీలకు దోఖా
⇒ హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం అందిస్తామని, మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు, అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. వాటిని ఇప్పటి దాకా అమలు చేయలేదు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం ఇప్పటికీ చేపట్టలేదు. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయిస్తామన్న హామీకి దిక్కేలేదు.
⇒ నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని, రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ అమలు జాడే లేదు.
⇒ క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని, చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామని.. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపు, జెరూసలెం యాత్రికులకు సాయం అందిస్తామంటూ ఇచ్చిన హామీని ఇప్పటి దాకా అమలు చేయలేదు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆరు త్రైమాసికాలకు సంబంధించి రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక డాక్టర్ అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.
గాల్లో దీపంగా ప్రజారోగ్యం
దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని, అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని.. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. కానీ.. ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. గత ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు పూర్తిగా నీరుగార్చేశారు.
ఈ పథకం కింద చికిత్స అందించడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. కానీ.. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్న వారికి రూ.3,600 కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న వారు విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు వంతున ఆరోగ్య ఆసరా కింద గత ప్రభుత్వం ఇచ్చేది. ఆరోగ్య ఆసరాకు ఏటా రూ.400 కోట్లు అవుతుంది. ఆరోగ్యశ్రీ రూ.3600 కోట్లు, ఆరోగ్య ఆసరా రూ.400 కోట్లు మొత్తం రూ.4000 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు.
విద్యుత్ చార్జీల బాదుడు రూ.15,485 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా భారీగా పెంచేశారు. విద్యుత్ చార్జీల రూపంలో ఏడాదిలోనే రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.
అగ్రవర్ణ పేదలకు అన్యాయం
⇒ వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ బ్రాహ్మణులకు యువగళం కింద నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, ఏడాదిగా ఒక్కరికీ ఇవ్వకుండా వంచించారు.
⇒ ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించి, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు.
⇒ భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుగా నామకరణం చేయలేదు.
⇒ కమ్మ, రెడ్డి, వెలమ తదితర అగ్ర కుల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి.. వారి సాధికార, అభివృద్ధికి చర్యలు చేపడతామన్న హామీని తుంగలో తొక్కారు.
చెదురుతున్న సొంతింటి స్వప్నం
గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఏడాదిగా ఏ ఒక్కరికీ సెంటు స్థలం ఇవ్వలేదు. కొత్తగా ఇళ్లు మంజూరు చేయలేదు. పేదల సొంతింటి స్వపాన్ని చిదిమేస్తున్నారు.
నత్తనడకన సాగునీటి ప్రాజెక్టులు
పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి అనుసంధానం వంటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని.. ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకే కుదించి ఆ ప్రాజెక్టును బ్యారేజ్గా మార్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. గాలేరు–నగరి ఆపేశారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కుల నుంచి 3,850 క్యూసెక్కులకు తగ్గించి లైనింగ్ చేస్తున్నారు. రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్ను వేసింది.
బాదుడే బాదుడు
⇒ పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామన్న∙హామీ నిలుపుకోలేదు.
⇒ మద్యం ధరలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఊరూరా.. వాడవాడన బెల్ట్షాపులు వెలిశాయి.
⇒ రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి.. పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఎండీయూ వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లు రద్దు చేశారు. దాంతో ఎండీయూ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు 20 వేల మంది రోడ్డున పడ్డారు. రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి తెచ్చారు.