టెన్త్‌ విద్యార్థులపై చెరగని ‘రిమార్కు’ | Student community across the state is outraged by the education departments behavior | Sakshi
Sakshi News home page

టెన్త్‌ విద్యార్థులపై చెరగని ‘రిమార్కు’

Jun 1 2025 5:03 AM | Updated on Jun 1 2025 9:51 AM

Student community across the state is outraged by the education departments behavior

విద్యాశాఖ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమంటున్న విద్యార్థి లోకం 

సాక్షి, అమరావతి/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌)/­నూజివీడు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పదో తరగతి ఫలితాల్లో తీవ్రస్థాయి తప్పులు జరగడంతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై విద్యార్థి లోకం మండిపడుతోంది.. తమ బిడ్డల భవిష్యత్‌ ముడిపడి ఉన్న పరీక్ష పత్రాలను ఇంత అడ్డగోలుగా దిద్దుతారా? అంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు.. లేనిపోని ఆర్భాటాలకు పోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా? అంటూ విద్యార్థి సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.. రికార్డుల పిచ్చితో వారంలో పేపర్లు దిద్దేశామంటూ గొప్పలు పోవడం వేలమంది జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విద్యారంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఏడాది పదో తరగతి జవాబు ప­త్రా­ల మూల్యాంకనంలో కూటమి సర్కారు ‘ఫెయిల్‌’ అయిందని తేల్చి చెబుతున్నారు. ఫెయిలైనవా­రిలో 60% మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్‌ లేదా రీ వా­ల్యుయేషన్‌కు నమోదు చేసుకోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉంటుందని పేర్కొంటున్నారు. వాల్యుయేషన్‌లో ఇంత ఘోరంగా విఫలమైనవారు.. రీ వాల్యుయేషన్‌లో అయినా సరిగ్గా వ్యవహరిస్తారనే నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  

నారా లోకేశ్‌.. నోరు మెదపరేం..? 
ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత 66,363 మంది పేపర్ల రీ వెరిఫికేషన్‌కు దర­ఖాస్తు చేసుకోగా వీరిలో 11 వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కులు మార్పు చెందినట్టు ఎస్‌­ఎస్‌సీ బోర్డే ప్రకటించింది. వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం అని గొప్పలు పో­యేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్ద పొరపాటే చేసింది. 

దీంతో హడావుడి చేసి.. ఉపాధ్యా­యు­లపై ఒత్తిడి తెచ్చి వేగంగా పేపర్లు దిద్దించిన సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ నోరు మెదపరేం? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పే లోకేశ్‌.. స్వయంగా తన శాఖలో జరిగిన దారుణంపై ఉ­లుకుపలుకు లేకుండా ఉండడం ఏమిటని నిలదీస్తున్నారు. 

వేగంగా మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తెచ్చి, టీచర్లకు ఎక్కువ పేపర్లు ఇవ్వడమే తప్పులు దొర్లడానికి కారణమని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్లు దిద్దిన ఉపాధ్యా­యులను బాధ్యులను చేసి సస్పెండ్‌ చేసిన సర్కారు.. మరి మంత్రిగా విఫలమైన లోకేశ్‌ను ఎందుకు తప్పించడం లేదని సూటిగా అడుగుతున్నారు. 

జీవితంపై దెబ్బకొట్టారు.. 
పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రభుత్వ విభా­గాల్లోని ట్రిపుల్‌ ఐటీ, గురుకులాల్లో మెరుగైన విద్య­ను పొందే అవకాశం దక్కుతుంది. ఊహించని విధంగా ఫెయిల్‌ కావడంతో అనేకమంది విద్యా­ర్థులు ఐఐఐటీ, రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో  సీట్లు పొందలేకపోయారు. 

పేద, మధ్య తరగతి వి­ద్యార్థులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద పలు కార్పొరేట్‌ సంస్థలు ఆర్థిక సాయం చేస్తుంటాయి. తప్పుల మూల్యాంకనం కారణంగా ఇప్పుడీ అవకాశాలు చేజారాయి. ఈ నేపథ్యంలో ఎవరిది తప్పు..? మాకెందుకీ శిక్ష? అని  విద్యార్థులు నిలదీస్తున్నారు. తమ మనో వ్యథను ఎవరు తీరుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 

11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారాయి
కాగా, ఈ ఏడాది 45,96,527 పదో తరగతి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్టు పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. 16,482 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్, 5,494 మంది స్పెషల్‌ అసిస్టెంట్స్, 2,747 మంది చీఫ్‌ ఎగ్జామినర్స్‌ ఇందులో పాల్గొన్నట్లు చెప్పారు. రోజుకు ఒక్కో ఉపాధ్యాయుడు 40 పేపర్లు దిద్దినట్టు వివరించారు.  

కొన్నేళ్లుగా 44.50 లక్షల నుంచి 47.80 లక్షల వరకు జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 99.76 శాతం కచ్చితత్వంతో పేపర్లు దిద్దామని.. 34,709 మంది విద్యార్థులు జవాబు పత్రాల రీచెకింగ్‌కు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. 11,175 జవాబు పత్రాల్లో మార్కులు మారినట్లు తెలిపారు.

‘కార్పొరేట్‌ ఇంటర్‌’ కొమ్ముకాయడానికే హడావుడి!
ఇంటర్‌ తరగతులను హడావిడిగా ప్రారంభించి కార్పొరేట్లకు కొమ్ముకాయడానికే పదో తరగతి పేపర్లు త్వరగా దిద్దించారు. మూల్యాంకనంలో ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది. దీనికి ఉపాధ్యాయులను బలి చేయడం దారుణం. విద్యా సంస్కరణల పేరుతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇచ్చామని మంత్రి లోకేశ్‌ గొప్పలు చెబుప్పడం సిగ్గుచేటు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేశారు? ప్రభుత్వం విద్యార్థుల నుంచి వసూలు చేసిన రీవాల్యుయేషన్‌ ఫీజు తిరిగి చెల్లించాలి.  –ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్‌రావు, ప్రసన్నకుమార్‌ 

విద్యార్థుల జీవితాలతో మంత్రి లోకేష్‌ చెలగాటం 
విద్యా వ్యవస్థను మంత్రి లోకేశ్‌ గాలికి వదిలేశారు. టెన్త్‌ ఫలితాలు వారం రోజుల్లోనే వెల్లడించేస్తాం అని విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. ప్రభుత్వ తప్పిదం పిల్లల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. –ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్‌ జీ 

ప్రతిభావంతులను ఫెయిల్‌ చేయడమేనా రికార్డు? 
వారం రోజుల్లో మూల్యాంకన ప్రక్రియ ముగించాలనే అనవసర ఒత్తిడితోనే తప్పులు దొర్లా­యి. తక్కువ సమయంలో ఫలితాలు ప్రకటించామని ప్రభుత్వం రికార్డుగా చెప్పుకొంటోంది. 66,363 పేపర్ల రీ వాల్యుయేషన్‌కు దర­ఖాస్తు­లు రావడం, 11 వేలపైగా పేపర్లలో విద్యార్థుల ఉత్తీర్ణత, మార్కులు మారడం ఏం రికార్డు? –ఆలిండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మహేష్‌ 
 
లోకేశ్‌ గొప్పలు.. విద్యార్థులకు తిప్పలు 
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం విషయంలో ఉన్న శ్రద్ధ పదో తరగతి విద్యార్థులకు సరైన ఫలితాలను విడుదల చేయడంలో లేదు. తక్కువ సమయంలోనే ఫలితాలు విడుదల చే­శా­­మని ప్రభుత్వం, మంత్రి లోకేశ్‌ గొప్పలు చె­ప్పు­కొంటే.. తమ ప్రతిభకు తగ్గట్లుగా మార్కు­లు రాక విద్యార్థులు మనో వేదనకు గుర­య్యారు. –ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్‌ 

విద్యార్థులను అంధకారంలోకి నెట్టింది
కూటమి ప్రభుత్వం పది పరీక్షల మూల్యాంకనంతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తప్పుల మూల్యాంకనంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించాలి. –ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓబులేసు 

ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు
పిల్లల మా­ర్కుల విషయంలో తల్లిదండ్రులు ఆందో­ళన చెందుతుంటే  ప్ర­భు­త్వానికి చీమ కుట్టిన­ట్టు కూడా లేదు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో 90కి పై­గా మార్కులు వచ్చిన విద్యార్థులు ఒక సబ్జెక్టు­లో ఫె­యిల్‌ కావడం బహుశా చరిత్రలో ఇదే తొలిసా­రి.    –బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వై.గోపీ    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement