రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
రెండు రోజుల్లో మరింత విస్తరించే అవకాశం
నైరుతి వచ్చినా కొనసాగుతున్న ఎండల తీవ్రత
సాక్షి, అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. శనివారం ఇవి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 4న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు రెండు రోజుల్లోనే ఏపీకి విస్తరించాయి. అయితే వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో వాటి గమనం నెమ్మదిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించినా వర్షాలు మాత్రం తక్కువగానే కురుస్తాయని తెలిపింది. రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడతాయని... కొన్ని రోజులపాటు వర్షాలు కురిసి మరికొన్ని రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. అందువల్ల ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు రుతుపవనాలు ప్రవేశించినా శనివారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఆదివారం 58 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని, మరో 104 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.


