చిత్తూరు జిల్లా : ఫోన్లో గేమ్స్ ఆడవద్దని మందలించినందుకు ఓ అల్లుడు మామను హతమార్చాడు. విచక్షణ కోల్పోయి పిడిగుద్దులతో గుండెలపై బాది అక్కడికక్కడే హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, రంగంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రంగంపేటకు చెందిన సుబ్రహ్మణ్యం (60)కు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెను నెల్లూరు జిల్లా, వెంకటగిరికి చెందిన అశోక్కు ఇచ్చి వివాహం చేశారు.
అతడు దుబాయ్లో పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితమే దుబాయి నుంచి మామ సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో అశోక్ మొబైల్లో గేమ్ ఆడుతుండడాన్ని గమనించిన మామ, నిరంతరం గేమ్లకే అతుక్కుపోతున్నావంటూ అల్లుడిని మందలించాడు. దీంతో ఆగ్రహించిన అశోక్ విచక్షణ కోల్పోయి మామపై దాడి చేసి కిందకు నెట్టేశాడు. అనంతరం ఆయన గుండెలపై కూర్చుని పిడిగుద్దులు గుద్దడంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు అశోక్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు çపూతలపట్టు సీఐ తిమ్మయ్య తెలిపారు.


