
భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో అనర్థాలు
చిచ్చు రేపుతోన్న సోషల్ మీడియా పరిచయాలు
ఇద్దరి మధ్యకు మూడో వ్యక్తి రావడంతో హత్యలకు దారి
బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్న పిల్లలు
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
» సత్యసాయి జిల్లా దర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన ఓ వివాహితకు రొద్దం మండలానికి చెందిన పురుషుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనుమానం వచ్చిన భర్త మంజునాథ్ నిత్యం వేధించసాగాడు. మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. మద్యం మత్తులో ఉన్న భర్తను కిరాయి ఇచ్చి హత్య చేయించింది. గతేడాది జరిగిన ఈ ఘటనకు కారణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఏడాది తర్వాత మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి.
» సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో గతేడాది ఎన్నికల సమయంలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే దీనికి కారణంగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో శ్రీనివాసరెడ్డి మరికొందరితో కలిసి అమర్నాథ్రెడ్డిని హతమార్చాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.
సాక్షి, పుట్టపర్తి : రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతో పాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నం అవుతోంది. చిన్నపాటి మనస్పర్థల కారణంగా పరాయి వ్యక్తులతో చనువుగా పెరిగి.. సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది.
అలాంటి సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అడ్డు తొలగించుకునే క్రమంలో భర్తలను, ప్రియులను చంపేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. హత్య చేసి పరారీ అవుతుండటంతో చిన్నారులు ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాక బాల్యంలోనే కార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్నారు.
అఘాయిత్యాలకు దారి తీస్తూ..
వివాహేతర సంబంధాలతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరి మధ్యలోకి మరొకరు రావడంతో పరిస్థితులు నిమిషాల్లో మారిపోతున్నాయి. క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.
దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అలాంటి దంపతుల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అంతేకాదు వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నెలకొంది.
కారణాలు ఎన్నెన్నో..
» పని ఒత్తిడితో జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
» చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ.. పదే పదే చర్చించి.. తల్లిదండ్రుల వరకూ వెళ్లడం.. ఆ తర్వాత పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు.
» జీవిత భాగస్వాములు తాము చెప్పినట్లు వినలేదంటూ ఇద్దరిలో ఎవరో ఒకరు దారి తప్పి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు.
» స్మార్ట్ఫోన్లను అతిగా వినియోగించి సోషల్ మీడియా పరిచయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం.
» మద్యానికి బానిసై ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని .. కుటుంబ పోషణ గురించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం కూడా కారణమవుతోంది.
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
దంపతుల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. అయితే క్షణికావేశాలకు వెళ్లకుండా.. సామరస్యంగా ఇద్దరూ పరిష్కార మార్గం ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహం జరిగిన కొత్తలో మనస్ఫర్థలు వచ్చినా.. వెంటనే సరిదిద్దుకోవాలి. అయితే ఇరవై ఏళ్ల దాంపత్య జీవితంలో కూడా ఇంకా సమస్యలు వెలుగు చూస్తుండటం అవగాహన లోపమే.
దంపతులిద్దరూ పిల్లలు, కుటుంబ బాధ్యతల గురించి తెలుసుకుంటే ఎలాంటి మనస్పర్థలు రావు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుంది. అంతేకాకుండా చిన్నారులు అనాథలుగా మారాల్సి వస్తోంది. – వి.రత్న, సత్యసాయి జిల్లా ఎస్పీ