సాగు సమ్మె దిశగా రొయ్య రైతులు! | Shrimp farmers heading for a farming strike | Sakshi
Sakshi News home page

సాగు సమ్మె దిశగా రొయ్య రైతులు!

Jun 21 2026 3:42 AM | Updated on Jun 21 2026 3:42 AM

Shrimp farmers heading for a farming strike

చంద్రబాబు సర్కార్‌పై సడలిన నమ్మకం ఆక్వా రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి

భారమవుతున్న మేత ధరలు

పతనమవుతున్న కౌంట్‌ ధరలు

చంద్రబాబును నమ్మి మోసపోయామంటున్న రైతులు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రొయ్య రైతులు సాగు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు రొయ్యల ధరలు పతనమవుతుండగా.. మరోవైపు భారీగా పెంచిన మేత ధరలు రొయ్యల సాగుకు పెనుభారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో రొయ్యల్ని పట్టుబడి పడుతున్న రైతుల్లో అత్యధికులు సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 

ఫీడ్‌ తయారీదారులు, ప్రాసెసింగ్‌ కంపెనీలు, ఎగుమతిదారులకు కొమ్ముకాస్తూ రైతుల ప్రయోజనాలను పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా లంకలకోడేరుకు చెందిన ఓ రైతు ఇప్పటికే సాగు సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించడమే కాకుండా తహసీల్దార్‌కు నోటీసు కూడా ఇచ్చారు. ఆయన బాటలోనే మరికొందరు మంది రైతులు  సాగు సమ్మెకు దిగడమే మేలన్న ఆలోచనలో ఉన్నారు.

పతనమైన ధరలతో సతమతం
రాష్ట్రంలో ఈ–ఫిష్‌ డేటా ప్రకారం 1.62 లక్షల మంది రైతులు 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేçస్తున్నారు. పెరిగిన చెరువుల లీజు, మేత ధరలు, విద్యుత్‌ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.270–రూ.290 ఖర్చు చేయాల్సి వస్తోంది. 50 కౌంట్‌కు చేరాలంటే కిలోకు రూ.340–రూ.350, గరిష్టంగా 30 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.450కు పైగా ఖర్చవుతోంది. వైరస్‌ల ప్రభావంతో వేసవి పంటలో 70–80శాతం, రెండో పంటలో 30–40 శాతానికి మించి సీడ్‌ సక్సెస్‌ రేటు ఉండటం లేదు. 

100 కౌంట్‌లో ఎకరాకు టన్ను, 50 కౌంట్‌ అయితే 2 టన్నులు, 30 కౌంట్‌ అయితే 3 టన్నులకు మించి వచ్చే పరిస్థితి లేదు. 3 టన్నుల పట్టుబడి పట్టే రైతులు నూటికి 10–15 శాతం మించి ఉండరు. అమెరికా సుంకాల పేరిట గత ఏడాది రొయ్యల ధరలను భారీగా తగ్గించేశారు. ఆ తరువాత పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మూడు నెలల క్రితం కిలో రూ.275 పలికిన 100 కౌంట్‌ ప్రస్తుతం రూ.225కు దిగజారింది. 50 కౌంట్‌ ధర రూ.285, 30 కౌంట్‌ ధర రూ.425కు పడిపోయాయి.

గోరుచుట్టుపై రోకలి పోటులా..
టన్ను వనామీ రొయ్యల ఉత్పత్తికి రూ.2.60 లక్షలు, టన్ను టైగర్‌ రొయ్యల ఉత్పత్తికి రూ.3.50 లక్షలు, చేపలకైతే రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల మేత కోసం రూ.1.50 లక్షలు, చేపల మేతకైతే రూ.75 వేల వరకు రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.1.08 లక్షలకు చేరింది. గడచిన 5 నెలల్లో టన్నుకు రూ.16 వేల చొప్పున పెంచగా, సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో రూ.4 వేలు తగ్గించేందుకు అంగీకరించిన కంపెనీలు 24 గంటలు తిరక్కుండానే  టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించే ప్రసక్తే లేదని ప్లేట్‌ ఫిరాయించాయి. 

రొ­య్యల ధరలు పడిపోవడం, మేత­ల ధరలు, సాగులో వినియోగించే ఇతర పరికరాల ధరలు పెరిగిపోవడంతో ఆక్వా సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని పాలకొల్లుకు చెందిన ఆక్వా రైతు కె.సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుబడి పూర్తి కాగానే సాగు సమ్మెకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.

క్రాప్‌ హాలిడేకు వెళ్తున్నా
నేను దాదాపు మూడు దశాబ్దాలుగా రొయ్యల సాగు చేస్తున్నా. 1998లో 25 కేజీల ఫీడ్‌ బస్తా ధర రూ.1,125 ఉండగా.. ఇప్పుడు రూ.2,700కి చేరింది. నాడు 30 కౌంట్‌ ధర రూ.625 పలకగా.. ఇప్పుడు రూ.425కు దిగజారిపోయింది. ప్రస్తుతం ఎకరాకు రూ.3.50 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు ఖర్చవుతోంది. రొయ్యల ధరలు తగ్గటం, మేత ధరలు పెరగటంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

ప్రాసెసింగ్‌ కంపెనీలు, ఫీడ్‌ తయారీదారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే క్రాప్‌ హాలిడేకు వెళ్లాలని నిర్ణయించుకుని తహసీల్దార్‌ లిఖిత పూర్వకంగా తెలియజేశా. చాలామంది రైతులు క్రాప్‌ హాలిడేకు వెళ్లాలని భావిస్తున్నారు.– వేగేశ్న గోపాలకృష్ణంరాజు, లంకలకోడేరు, పాలకొల్లు మండలం 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement