శానిటేషన్‌ టెండర్లలో రా'బంధువు' | Sanitation maintenance contract in government hospitals to tdp favour | Sakshi
Sakshi News home page

శానిటేషన్‌ టెండర్లలో రా'బంధువు'

Jun 27 2025 5:54 AM | Updated on Jun 27 2025 5:54 AM

Sanitation maintenance contract in government hospitals to tdp favour

సీఎం చుట్టానికి కలిసొచ్చేలా ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుద్ధ్యం టెండర్ల నిబంధనలు

2024–25 అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోని టీడీపీ కూటమి ప్రభుత్వం

అలాచేస్తే సీఎం బంధువు సంస్థకు నష్టం వాటిల్లుతుందని పన్నాగం

ఇప్పటికే ఒకసారి ఈ సంస్థకు కాంట్రాక్టు దక్కలేదని టెండర్లే రద్దు 

రెండోసారి ఆ సంస్థకే దక్కేలా పావులు

మరో టెండరులో మాత్రం 2024–25 ప్రామాణికం

సాధారణంగా ఎక్కడైనా టెండర్లు పిలుస్తున్నారంటే ప్రజాప్రయోజనాలు, నాణ్యమైన సేవల కల్పనకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తారు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో అలా కాదు. ప్రజాధనాన్ని దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యం. ప్రతి కాంట్రాక్టును బంధువులు, అస్మదీయులకు కట్టబెట్టి తద్వారా కోట్లాది రూపాయలు దండుకోవాలన్నదే వ్యూహం. ఇందుకు తగ్గట్లుగానే టెండరు నిబంధనలూ రూపొందుతాయి. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్‌ నిర్వహణ కాంట్రాక్టు ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ విషయంలో సీఎం బంధువు చెప్పిందే రూల్‌ అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ (ఏపీ వైద్య విధాన పరిషత్‌), బోధనాస్పత్రుల్లో శానిటేషన్‌ నిర్వహణకు కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక కోసం గత నెలలో వైద్యశాఖ టెండర్లు పిలిచింది. ఈ టెండరు నిబంధనల్లో 2019–20 నుంచి 2023–24 మధ్య సేవలు అందించిన అనుభవం, ఫైనాన్షియల్‌ టర్నోవర్‌నే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనలు పెట్టడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం పిలిచిన టెండర్లలో 2024–25 అనుభవం, ఫైనాన్షియల్‌ టర్నోవర్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని, అలా తీసుకుంటే వచ్చే నష్టం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.    – సాక్షి, అమరావతి

ససేమిరా అంటున్న ప్రభుత్వం..
ఇందుకు సంబంధించి గతనెల 22న ఏపీఎంఎస్‌ఐడీసీ శానిటేషన్‌ టెండర్లను ఆహ్వానించింది. ప్రీ బిడ్‌ మీటింగ్‌లో 2024–25 అనుభవం, ఫైనాన్షియల్‌ టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చాలా సంస్థలు కోరాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం కుదరదని తేల్చేసింది. సాధారణంగా టెండరు ఆహ్వానించిన సమయానికి ముందు మూడు, నాలుగు, ఐదేళ్ల అనుభవం.. ఆర్థిక లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే అంశాన్ని ప్రీ బిడ్‌ మీటింగ్‌లో కొందరు కాంట్రాక్టర్లు ప్రస్తావించారు. 

మరోవైపు.. శానిటేషన్‌ టెండర్లు పిలవడానికి రెండ్రోజుల ముందు వైద్య కళాశాలల్లో యూజీ, పీజీ సీట్ల పెంపు కోసం ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుకు ఏపీఎంఎస్‌ఐడీసీ టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండరు నిబంధనల్లో గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వార్షిక టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని నిబంధన పెట్టారు. అనంతరం పిలిచిన చిన్నచిన్న టెండర్లలోనూ అదే నిబంధనను కొనసాగించారు. 

సీఎం బంధువుకు నష్టం జరుగుతుందనే..
ఆస్పత్రుల నిర్వహణలో అత్యంత కీలకమైన, రూ. వందల కోట్లు విలువచేసే శానిటేషన్‌ టెండర్లలో మాత్రం సీఎం బంధువు సంస్థకు నష్టం జరుగుతుందనే 2024–25 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదని సమాచారం. 2019–20 నుంచి 2023–24 మధ్య అత్యధిక టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుని పనులను అవార్డు చేసేలా ప్రస్తుత టెండరు నిబంధన ఉంది. 2024–25లో సీఎం బంధువు సంస్థకు పెద్ద టర్నోవర్‌ లేదని సమాచారం. 

ఈ క్రమంలో టెండర్లు పిలిచిన నాటికి ఐదేళ్ల ముందు అనుభవం, టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటే సదరు సంస్థకు పనులు దక్కవని, అసలు పోటీలోనే లేకుండాపోతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిబంధనల్లో మెలికపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు.. 2019–24 మధ్య టెండర్లలో పాల్గొన్న సంస్థలపై బ్లాక్‌ లిస్టింగ్‌/పోలీస్‌ కేసులు ఉండకూడదని నిబంధన ఉంచారు. 

ఈ నిబంధన ప్రకారం 2024–25లో బ్లాక్‌ లిస్టింగ్‌/పోలీస్‌ కేసులున్న సంస్థలు టెండర్లలో పాల్గొనడానికి వీలుంది. ఇప్పటికే సెక్యూరిటీ టెండర్ల మార్గదర్శకాల్లో ఏపీఎంఎస్‌ఐడీసీ చేసిన తప్పులను ఆసరాగా చేసుకుని అర్హతలేని సంస్థలు రాజకీయ పలుకుబడితో కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. శానిటేషన్‌  టెండర్లలోనూ అలా జరిగేందుకు అధికారులే అవకాశాలిస్తున్నట్లు కనిపిస్తోంది.

చివరి దశలో టెండర్ల రద్దు..
వాస్తవానికి.. కొద్దినెలల క్రితమే శానిటేషన్‌ నిర్వహణ టెండర్లను పిలిచారు. ఆ సమయంలో సీఎం బంధువు సంస్థ తప్పులతడకగా బిడ్‌ దాఖలు చేసింది. దీంతో పరిశీలన దశలోనే బిడ్‌ అనర్హతకు గురైంది. ఈ సంస్థకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పనులు అవార్డుచేసే సమయంలో మొత్తం టెండర్లనే ప్రభుత్వం రద్దుచేసేసింది. అప్పట్లో కోర్టు కేసులు, ఎల్‌1గా నిలిచిన సంస్థలపై ఫిర్యాదులను సాకుగా చూపినట్లు ఆరోపణలున్నాయి. 

ఇక 2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్యశాఖల్లో పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లింగ్‌ చేసేశారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఈ సంస్థ అడ్రస్‌ లేకుండాపోయింది. గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ తెరపైకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement