ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి!‌ | Sakshi
Sakshi News home page

ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి!‌

Published Mon, Apr 19 2021 4:36 PM

Sadist Husband Harassing His Two Wives In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : భార్యలపై అనుమానంతో శాడిస్టు భర్త వారిని అంతమొందించేందుకు అమానుషంగా ప్రవర్తించాడు. మొదటి భార్యను ముక్కు, చెవులు కోసి హతమార్చాలని ప్రయత్నించగా, రెండో భార్యపై ఏకంగా పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఈ దారుణం వెలుగుచూసింది. చింతూరు ఎస్‌ఐ సురేష్‌ బాబు కథనం ప్రకారం.. చట్టిలో నివసముంటున్న కళ్యాణం వెంకన్నకు ఇద్దరు బార్యలు. వారిద్దరికిపై అనుమానం పెంచుకున్న అతను వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈనెల 3న రెండో భార్యను గ్రామంలోని దేవతా విగ్రహం వద్దకు తీసుకువెళ్లి వేడి నూనెలో చేతిని ముంచి ప్రయాణం చేయించాడు.

ఈ నెల 5న మొదటి భార్యను ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేసి, ముక్కు, చెవులు కోసేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మహిళ తన పుట్టింటికి పారిపోయింది. అదే రోజు రెండో భార్యను మండలంలోని నర్సింపురం సమీపంలోని ఆటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్‌ పోలీస నిప్పంటించడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె కూడా భద్రాయలంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనను చంపేస్తాడనే భయంతో ఆమె ఈ నెల 16న చింతూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, మొదటి భార్యను వేధింపులకు గురి చేస్తున్న సమయంలో నిందితుడు స్వయంగా సెల్ఫీ వీడియో తీశాడు. అది కాస్తా బయటకు రావడంతో ఈ అమానుష ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

చదవండి: చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ

Advertisement
Advertisement