మిగిలింది విభజనే! | Reorganization of schools in final phase | Sakshi
Sakshi News home page

మిగిలింది విభజనే!

May 10 2025 5:58 AM | Updated on May 10 2025 5:58 AM

Reorganization of schools in final phase

తుది దశకు పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ

ఇకపై రాష్ట్రంలో 9 రకాల సర్కారు బడులు.. హైస్కూళ్లలో 1–5 తరగతులకు ప్రత్యేక విభాగం 

యూపీ స్కూళ్ల కొనసాగింపునకు నిర్ణయం.. 294 బాలికల హైస్కూల్‌ ప్లస్‌లు కొనసాగింపు 

నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల 

అంతా గందరగోళం అంటున్న విద్యా రంగ ప్రముఖులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు అంచెల పాఠశాల విధానం స్థానంలో ఇకపై తొమ్మిది రకాల బడులు రానున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్ల బోధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6–10 తరగతులకు మాత్రమే పరిమితం కానుంది. ఈ మేరకు మార్పులతో ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు తెలిసింది. గత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పరిశీలనలు, ప్రయోగాలు చేసి, ఐదు నెలల క్రితం జీవో 117 ఉపసంహరణ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఇందులో ఐదు రకాల పాఠశాలలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అయితే తాజాగా అవి తొమ్మిది రకాలకు పెంచారని సమాచారం. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లోని 3–5 తరగతులను వెనక్కి తెచ్చి మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్‌) ఏర్పాటు చేయాలనుకున్నా అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలపై ఒత్తిడి తెచ్చి స్కూళ్లను విలీనం చేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల స్కూళ్లను మాతమ్రే గుర్తించగలిగారు. మరోపక్క హైస్కూల్‌ ప్లస్‌లను రద్దు చేస్తామని తీవ్రంగా ప్రయత్నించగా ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 900 ఉన్నత పాఠశాలల్లో 3–5 తరగతులను అక్కడే ఉంచి 1, 2 తరగతులు అదే పాఠశాలలకు చేర్చనున్నారు. ఇదే స్కూల్లో 1–5 తరగతులకు ప్రత్యేక ప్రైమరీ విభాగం ఏర్పాటు చేస్తారు. ఈ తరగతులకు ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీలను ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. అంటే 3–5 తరగతులు హైస్కూల్లో ఉన్నా, సబ్జెక్టు టీచర్ల బోధన రద్దు చేశారు. ప్రస్తుతం ఉన్న హైస్కూల్‌ ప్లస్‌ ఉపసంహరణ పైనా విద్యాశాఖ వెనక్కి తగ్గింది. 294 బాలికల హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను కొనసాగించనున్నారు. 

కో–ఎడ్యుకేషన్‌ కింద ఉన్న 210 హైస్కూల్‌ ప్లస్‌లను ఇంటర్మీడియట్‌ విభాగానికి అప్పచెబుతామని చెబుతున్నా పూర్తి స్థాయి విధివిధానాలను వెల్లడించలేదు. కాగా, జీవో 117ను రద్దు చేయాలన్న పట్టుదలతో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా ప్రభుత్వం బడుల విభజనకే మొగ్గు చూపుతోంది.  

విద్యా సంవత్సరమంతా గందరగోళం  
» కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. టీచర్ల సర్దుబాటు పేరుతో దాదాపు 7 నెలలు గడిపింది. తర్వాత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు పంపుతున్నామని తీర్మానించింది.  
» పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల పాఠశాలల్లో ఈ తరగతుల విద్యార్థులను పంచాయతీ కేంద్ర పాఠశాలలో కలిపారు. వీటిల్లో 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటే మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా లేకుంటే బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు చేస్తూ ప్రధానోపాధ్యాయుల నుంచి నివేదికలు తీసుకున్నారు. 
» ఈ క్రమంలో బడుల విలీనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయినప్పటికీ కొత్త నిబంధనల మేరకు హైసూ్కళ్లలోని స్కూల్‌ అసిస్టెంట్లను ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో మిగులుగా చూపించారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో విద్యాశాఖ పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. 
» హైస్కూళ్లలో ఉన్న 3–5 తరగతుల విద్యార్థులు 45 మంది ఉంటే వారితో మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా మార్చాలని, అంతకంటే తక్కువ విద్యార్థులు ఉంటే హైస్కూళ్లల్లో యథాతథంగా ఉంచి, ఆయా ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతులను కూడా హైసూ్కళ్లలో విలీనం చేస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో పాఠశాల పునర్‌ వ్యవస్థీకరణ ఉత్తర్వులు వెలువడనున్నాయి.  

ఫలితాలు వస్తున్న తరుణంలో ప్రయోగాలు  
»  గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎన్‌ఈపీ–2020 అమలులో భాగంగా పలు విద్యా సంస్కరణలను అమలు చేసింది. 2022 జూన్‌లో జీవో 117 ద్వారా 6 అంచెల స్కూలింగ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతులను ఒక కి.మీ దూరంలోని హైసూ్కళ్లకు తరలించి సబ్జెక్టు టీచర్‌ బోధన అమలు చేసింది.  
»  ప్రాథమిక తరగతులకు సబ్జెక్టు టీచర్ల బోధన విజయవంతంగా కొనసాగుతున్న తరుణంలో రెండేళ్లు పూర్తి కాకుండానే కూటమి ప్రభుత్వం జీవో 117ను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. పాఠశాలలను ఐదు రకాలుగా పునర్‌ వ్యవస్థీకరిస్తున్నట్టు ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాలు విడుదల చేసింది.  
» ఇందులో శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషన్‌ స్కూళ్లను యథాతథంగా ఉంచారు. ఫౌండేషన్‌ స్కూల్‌ ప్లస్‌ను బేసిక్‌ ప్రైమరీ స్కూళ్లుగా పేరు మార్చారు. ప్రీహైసూ్కళ్లను మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా, 3–10 తరగతులున్న హైస్కూళ్లను 6–10 తరగతులకు పరిమితం చేసి, 3–5 తరగతులను తిరిగి మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు తెచ్చే ప్రయత్నం చేశారు.  
»   1, 2 తరగతులను పూర్తిగా అంగన్వాడీలకు అప్పగించి, 3–5 తరగతులను మోడల్‌ స్కూళ్లలో ఉంచాలని ఒకసారి, హైసూ్కళ్లలోనే ప్రత్యేకంగా ఉంచి ఎస్‌జీటీలతో బోధన అందించాలని మరోసారి నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా 3–5 తరగతులున్న కొన్ని హైసూ్కళ్లలో 1, 2 తరగతులను కూడా తరలించి ప్రైమరీ సెక్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement