ఆ ద్రోహం మీ బాబుదే రామోజీ | Ramoji Rao Fake News On YSRCP On Eenadu Paper | Sakshi
Sakshi News home page

ఆ ద్రోహం మీ బాబుదే రామోజీ

Apr 27 2024 7:06 AM | Updated on Apr 27 2024 7:06 AM

Ramoji Rao Fake News On YSRCP On Eenadu Paper

సాక్షి, అమరావతి: అన్ని వర్గాల పక్షపాతిగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్‌ సర్కారుకు వంకలు పెడుతూ అబద్ధాలు అచ్చేస్తున్న రామోజీరావు మరో అవాస్తవాన్ని మిత్ర ద్రోహం శీర్షికతో వండి వార్చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మొదటి వేటు యానిమేటర్లపైనే పడుతుందని అలవోకగా అబద్ధం ఆడేశారు. యానిమేటర్లను మోసం చేసింది చంద్రబాబేనన్న నిజాన్ని దాచిపెట్టి అప్పటి దారుణాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెట్టేశారు. పొదుపు సంఘాల డ్వాక్రా యానిమేటర్లకు ఉమ్మడి ఏపీలో 2014కు ముందు రూ. రెండువేల గౌరవ వేతనం ఉండేది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ గౌరవ వేతనాన్ని నిలిపివేశారు.

యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. వీరి ఆగ్రహం ఎదురు తిరుగుతుందన్న భయంతో అదే గౌరవ వేతనం అందజేస్తామంటూ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించారు. అప్పట్లో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డిని యానిమేటర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

పార్టీ అధికారంలోకి వస్తే రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని జగన్‌ ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా చెల్లిస్తున్నారు. అప్పట్లో బీమా మిత్ర, కళ్యాణ్‌మిత్రలు మండల కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవారు. కానీ, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా, వైఎస్సార్‌ కళ్యాణమస్తు పథకాలను వలంటీర్‌ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తున్నారు. దీన్ని కూడా తప్పుగా పేర్కొంటూ రామోజీ విషం చిమ్మారు.
 

Advertisement
 
Advertisement
Advertisement