ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం
సాక్షి, అమరావతి: ఏపీ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు, తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉందని శుక్రవారం వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ద్రోణి ప్రభావంతో శనివారం కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులకు ఆస్కారం ఉంది. ఆదివారం వర్షాల తీవ్రత మరికొన్ని జిల్లాలకు విస్తరించనుంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.


