
మహిళా కమిషన్ చైర్పర్సన్ తీరును తప్పుపట్టిన ప్రజా సంఘాలు
ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్
అనంతపురం టవర్క్లాక్: బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కనీస అవగాహన లేకుండా అత్యాచార బాధితురాలి పేరు చెప్పడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 14 మంది టీడీపీ కీచకులు దళిత బాలికపై అత్యాచారం చేయగా.. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దళిత బాలికను పరామర్శించేందుకు గురువారం అనంతపురం వచ్చిన రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును శైలజ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆమె తీరును జర్నలిస్టులు తప్పుపట్టారు. అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పకూడదంటూ నిబంధన ఉందని ఆమెకు గుర్తు చేశారు. గతంలో అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పారంటూ మాజీ ఎంపీ మాధవ్పై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్పైన కూడా కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
అలాగే ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఆమెను అడ్డుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో గిరిజన విద్యార్థిని తన్మయి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడ్డారు. దళిత బాలికపై సామూహిక అత్యాచారం విషయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు.
భయపడడం వల్లే హత్యలు, అత్యాచారాలు..
మహిళలు, బాలికలు భయపడటం వల్లే హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలనిని సూచించారు. ఏ కష్టం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు. అయినా పోలీసులపై ఆరోపణలు రావడంతో సీఐను సస్పెండ్ చేశామన్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేస్తామన్నారు.