కలిసొచ్చిన కొబ్బరి | The prices of raw coconut have increased dramatically | Sakshi
Sakshi News home page

కలిసొచ్చిన కొబ్బరి

May 26 2025 5:30 AM | Updated on May 26 2025 5:30 AM

The prices of raw coconut have increased dramatically

అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో జోష్‌ 

పచ్చి కాయలు వెయ్యింటికి రూ.1,500 నుంచి రూ.2 వేల పెరుగుదల 

రికార్డు స్థాయిలో రూ.22,500కి పెరిగిన కురిడీ ధర

సాక్షి, అమలాపురం: అన్‌సీజన్‌ సమయంలోనూ పచ్చి కొబ్బరి, కురిడీ కొబ్బరి ధర­లు అమాంతం పెరిగాయి. గడచిన మూడు రోజుల్లో పచ్చికాయలతోపాటు కురిడీ ధరలు సైతం పెరగడంతో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో సందడి నెలకొంది. సాధారణంగా శ్రీరామనవమి నుంచి వినాయక చవితి ముందు వరకూ అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు అన్‌సీజన్‌. చవితి పండుగకు నెల రోజుల ముందు సీజన్‌ మొదలవుతుంది. కానీ.. ఈసారి అన్‌ సీజన్‌లోనూ కొబ్బరికి డిమాండ్‌ ఏర్పడింది.

పచ్చి కాయలకూ భలే డిమాండ్‌
అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో వెయ్యి పచ్చి కాయల ధర రూ.15,500 నుంచి రూ.16 వేలకు చేరింది. రెండు రోజుల క్రితం రూ.13,500 నుంచి రూ.14 వేల వరకూ ఉండేది. తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు మార్చి నెల నుంచి కొబ్బరి బొండాల సేకరణ అధికంగా ఉంది. 

ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల కొబ్బరి అవసరాలను మన రాష్ట్రమే తీర్చాల్సి వస్తోంది. ముఖ్యంగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల అవసరాల కోసం మన రాష్ట్రం నుంచి కొబ్బరి కొనుగోలు పెరిగింది. దీంతో పచ్చికాయకు డిమాండ్‌ వచ్చిoది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 150 లారీల వరకూ కొబ్బరి కాయలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్టు అంచనా.

కురిడీ ధరల్లోనూ రికార్డు  
కురిడీ కొబ్బరికి సైతం రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. వారం క్రితం కురిడీ కొబ్బరిలో పాత కాయ గండేరా రకం (పెద్ద కాయ) వెయ్యికి రూ.20 వేలు ధర ఉండేది. ప్రస్తుతం వీటి ధర రూ.22,500 వరకూ పెరిగింది. గటగట (చిన్నకాయ) వెయ్యికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ పెరిగింది. కొత్త కాయలో గండేరా రూ.21,500, గటగట రూ.19,500 చొప్పున పలుకుతున్నాయి. కురిడీ ధరలు పెరగడానికి కూడా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు లేకపోవడమే కారణం. 

తమిళనాడులోని ఈరోడ్, తిరువూరు, కేరళలో­ని కోజికోడ్, కర్ణాటకలో హసన్, మాండ్యాల నుంచి కురిడీ కొబ్బరి ఎగుమతులు అధికం. ప్రస్తుతం ఆ మార్కెట్లలో కురిడీ కొబ్బరి తయారీ తగ్గడంతో ఇతర రాష్ట్రాలకు అవసరమైన మేరకు ఎగుమతి చేయలేకపోతున్నా­రు. ఇది కోనసీమ కురిడీ వ్యాపారులకు వరంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు సుమారు 70 నుంచి 100 లారీల వరకూ కురిడీ కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా.

మార్కెట్‌లో పెరిగిన జోష్‌ 
కొబ్బరి దిగుబడులు ఈ సీజన్‌లో చాలా తక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రెండు నెలల దింపు కాలానికి 1,500 నుంచి 2 వేల వరకూ కాయల దిగుబడి వస్తోంది. ఎకరాకు నెలకు సగటున 800 వరకూ కాయలు వస్తుండటం కూడా రైతులకు ఊరటనిస్తోంది.

దిగుబడి ఆశాజనకంగా ఉండటం, అందుకు తగినట్టుగా ధరలు పెరగడంతో చాలా రోజుల తరువాత అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో జోష్‌ నెలకొంది. రానున్న రోజుల్లో ధర మరింత పెరుగుతుందనే అంచనాలతో కొబ్బరి రైతులు, కురిడీ వ్యాపారులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement