శిశువుకు 'ముహూర్తం' గండం | Premature births have a serious impact on childrens development | Sakshi
Sakshi News home page

శిశువుకు 'ముహూర్తం' గండం

Jun 19 2025 5:15 AM | Updated on Jun 19 2025 5:15 AM

Premature births have a serious impact on childrens development

ప్రసవాలకూ ముహూర్తం నిర్ణయించుకుంటున్న వైనం 

డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు 

తల్లీబిడ్డ ప్రాణానికి ప్రమాదమున్నా.. ముహూర్తానికే సిజేరియన్‌ 

ముందస్తు ప్రసవాలతో పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం

హిందూపురానికి చెందిన వివాహితకు నెలలు నిండాయి. ప్రసవానికి ఇంకా 15 రోజుల గడువుందని వైద్యులు చెప్పారు. అయితే తన భర్త పుట్టిన రోజునాడే తాను బిడ్డకు జన్మనివ్వాలని భావించిన గర్భిణి  అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సిజేరియన్‌ ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత బిడ్డ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బెంగళూరుకు తీసుకెళ్లి రూ.6 లక్షలు ఖర్చు చేసి రెండు నెలల పాటు చికిత్స తీసుకున్నారు. అయినా బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపం కనిపిస్తోందని.. మూర్ఖత్వంతో ముందుగానే సిజేరియన్‌ చేయించి తప్పు చేశామని ఈ దంపతులు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు.

దొడ్డబళ్లాపురానికి చెందిన ఓ వ్యక్తి గర్భిణిగా ఉన్న తన భార్యకు హిందూపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రతి నెలా పరీక్షలు చేయించేవాడు. ఓ పురోహితుడి సూచన మేరకు మంచి ముహూర్తం ఉందని నెలలు నిండకముందే భార్యకు సిజేరియన్‌ చేయించాడు. చిన్నారి ఆరోగ్యం అదృష్టవశాత్తూ బాగుంది.. కానీ తల్లి ఆరోగ్యం క్షీణించడంతో తర్వాత బెంగళూరుకు తీసుకెళ్లారు.

సాక్షి, పుట్టపర్తి : మనిషి చంద్రమండలంలో అడుగుపెడుతున్న నేటి రోజుల్లోనూ... చాలా మంది ఇంకా మూఢనమ్మకాలను వీడడం లేదు. ముఖ్యంగా ముహూర్తాల పిచ్చితో కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ముహూర్తం కలిసి వస్తే ఫర్వాలేదు గానీ...  ఫలానా రోజే..ఫలానా ముహూర్తమే అన్నది      ఇబ్బందిగా మారింది. కొందరైతే ప్రసవాలకూ ముహూర్తాలు నిర్ణయిస్తూ శిశువులు, వారికి జన్మనిచ్చే తల్లుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 

ముహూర్తాల పిచ్చితో అమ్మ కడుపునకు గాటు పెట్టించి.. బిడ్డలను బలవంతంగా తీస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పు తలపెడుతున్నారు. ఈ జాఢ్యాన్ని కొందరు తల్లులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండటం వైద్యులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.  

సిజేరియన్‌కే మొగ్గు 
ఒకప్పుడు సిజేరియన్‌ పేరు చెబితే గర్భిణులు భయపడేవారు. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు.. గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు, గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, ఉమ్మనీరు పోతున్నప్పుడు, గర్భాశయ ముఖద్వారాన్ని మాయ కమ్మేసినప్పుడు తదితర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గతంలో సిజేరియన్‌ చేసేవారు. 

కానీ ప్రస్తుత కాలంలో సిజేరియన్‌ సర్వసాధారణంగా  మారింది. సహజ కాన్పుతో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో చాలామంది సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. సరైన ముహూర్తానికే పురుడు పోయాలని వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారు. 

మారుమూల పల్లెల వరకు 
ముహూర్తానికే సిజేరియన్‌ చేసి పురుడుపోసే సంప్రదాయం పట్టణాల నుంచి పల్లెల వరకూ పాకింది. ముహూర్తాల పేరుతో తమకు నచ్చిన రోజు.. నచ్చిన సమయానికే బిడ్డలకు జన్మనిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏడాదిన్నర వ్యవధిలో జిల్లా పరిధిలో జరిగిన ప్రసవాల సంఖ్యలో సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉండటం... అందునా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అధికంగా నమోదు కావడం గమనార్హం. 

ముహూర్తాల పేరుతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి.. కావాల్సిన సమయానికి బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఈ చెడు సంస్కృతి పట్టణాల నుంచి పల్లెల వరకు వ్యాపించింది. ఫలితంగా ప్రొలాక్టిన్‌ వంటి హార్మోన్లు విడుదల కాక పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో తల్లిపాలు పట్టకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. సిజేరియన్‌తో పలు మూత్రాశయ వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉంది.

శిశువులకు ప్రమాదం  
బిడ్డ జననం సహజంగా జరిగితే అది శిశువు మానసిక, శారీరక వికాసానికి దోహపడుతుంది. సిజేరియన్‌ ద్వారా మంచి ముహూర్తాల కోసం నెలల నిండక ముందే జన్మనిస్తే.. ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తక్కువ బరువు ఉంటారు. మానసిక ఎదుగుదల లోపిస్తుంది. బిడ్డలో ఆ సమయానికి అవసరమైన దాని కంటే తక్కువ హార్మోన్లు విడుదల కావడంతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది. – డాక్టర్‌ శివకుమార్, చిన్నపిల్లల  వైద్య నిపుణుడు, హిందూపురం 

ముహూర్తం..మూర్ఖత్వం 
కొందరు ముహూర్తం చూసుకుని సిజేరియన్‌ ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కడుపుకోత తల్లుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అంతేకాకుండా సమయానికి ముందే జన్మించడంతో చిన్నారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సిజేరియన్‌ విషయంలో మూర్ఖత్వంతో  వైద్యులపై ఒత్తిడి తేరాదు.  – డాక్టర్‌ ఫైరోజా బేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పుట్టపర్తి

ప్రోత్సహిస్తున్న ప్రైవేటు డాక్టర్లు 
కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు కూడా సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఒక సిజేరియన్‌కు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే     ప్రసవాల్లో 80 శాతం వరకు సిజేరియన్లు ఉండటం విశేషం. సిజేరియన్‌ చేస్తే ఆస్పత్రిలోనే వారం రోజుల పాటు బాలింతలు ఉండాల్సి వస్తోంది. దీంతో అదనంగా మరో రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. సహజ ప్రసవమైతే రూ.20 వేల లోపు ఖర్చుతో పాటు రెండు రోజుల్లో డిశ్చార్జి కావచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement