సాక్షి,రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు హర్షవీణపై దాడి కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల హర్షవీణపై జనసేన నాయకులు నడిరోడ్డుపై దాడి చేసి, పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని కొట్టడంతో పాటు తరుముతూ అల్లర్లు సృష్టించారు. ఈ ఘటనలో నిందితుడు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా, తాతంశెట్టి నాగేంద్ర విచారణలో పోలీసుల హైడ్రామా బయటపడింది. హర్షవీణపై దాడి చేసిన కేసులో విచారణను పోలీసులు అత్యంత గోప్యంగా నిర్వహించారు. విచారణ సందర్భంగా రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేశాడు. హర్షవీణను నడిరోడ్డుపై చితకబాదినా, ముద్దాయికి వేయాల్సిన బేడీలను స్టేషన్ గేటుకు వేసి విచారణ జరపడం పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్న తప్పులకే అమాయకులను నడిరోడ్డుపై నడిపించే పోలీసులు, ఇలాంటి ఘటనలో మాత్రం నిందితుడికి సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ ఆవేశంతో ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్రకు వంతపాడడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.



