పోలీసు బాస్‌లకు తెలిసే సీసీ టీవీ ఫుటేజీ మాయం | Police bosses knows CCTV footage disappears in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పోలీసు బాస్‌లకు తెలిసే సీసీ టీవీ ఫుటేజీ మాయం

Jun 26 2026 5:38 AM | Updated on Jun 26 2026 5:38 AM

Police bosses knows CCTV footage disappears in Andhra Pradesh

ఎస్పీ లేదా కమిషనర్‌ అనుమతి లేకుండా ఫుటేజీ తొలగింపు సాధ్యం కాదు

చట్ట నిబంధనల ప్రకారం వీరి అనుమతి ఉండాల్సిందే

వీరు అనుమతిచ్చినా పోలీసులు నేరుగా డిలీట్‌ చేయలేరు

ఎస్పీ/పోలీస్‌ కమిషనర్‌ నియమించే అధికృత వ్యక్తే ఆ పని చేయగలడు

గతంలో ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

సాయికృష్ణ కేసులో నెల రోజుల ఫుటేజీ మాయం కావడంపై సర్వత్రా విస్మయం

అన్ని రోజుల ఫుటేజీ డిలీట్‌ అయ్యిందంటే పోలీసు పెద్దలకు తెలిసే జరిగిందని స్పష్టం

ఫుటేజీ తొలగింపు అనేది సాక్ష్యాల తారుమారు, తుడిచిపెట్టడం కిందకే వస్తుంది

ఇది చట్ట ప్రకారం నాన్‌ బెయిలబుల్‌ నేరం.. బాధ్యులను సస్పెండ్, డిస్మిస్‌ చేయొచ్చు

నిష్పాక్షిక దర్యాప్తుతో ఫుటేజీని ఎవరు డిలీట్‌ చేశారో తెలుసుకోవచ్చు.. రికవరీ చేయొచ్చు

సాక్షి, అమరావతి: గాదె సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం, కనుమరుగు వ్యవహారంలో కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీ మాయం కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవు­తున్నాయి. పోలీసు పెద్దల సహాయ, సహకా­రాలు లేకుండా సీసీ టీవీ ఫుటేజీ మాయం అయ్యే అవకాశమే లేదు. చట్ట నిబంధ­నల ప్రకారం సీసీ టీవీ ఫుటేజీని డిలీట్‌ చేయా­లంటే జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్‌లలో కమిష­నర్‌ అనుమతి తప్పనిసరి. వీరి అనుమతి లేకుండా పోలీస్‌స్టేషన్‌లలో సీసీటీవీ ఫుటేజీని డిలీట్‌ చేయడం ఎంత మాత్రం సాధ్యం కాని పని. ఏ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)కు కూడా సీసీ టీవీ ఫుటేజీని డిలీట్‌ చేసేందుకు అనుమతి ఉండదు. డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌), నెట్‌వర్క్‌ వీడియో రికార్డర్‌ (ఎన్‌వీఆర్‌)లలో నిక్షిప్తమయ్యే సీసీ టీవీ ఫుటేజీని తొలగించాలంటే ఎస్పీ లేదా కమిషనర్‌ నుంచి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. వారు నేరుగా పోలీసులకు అనుమతి ఇవ్వరు. సదరు సీసీ టీవీ ఫుటేజీని తెరిచేందుకు ఓ అధీకృత వ్యక్తిని నియమిస్తారు. ఆ వ్యక్తికి మాత్రమే దానిని పరిశీలించే, డిలీట్‌ చేసే అధికారం ఉంటుంది. అనుమతులు లేకుండా పోలీసులు నేరుగా సీసీ టీవీ ఫుటేజీని డిలీట్‌ చేయడం చట్టరీత్యా తీవ్ర నేరం. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) లేదా ఐపీసీ సెక్షన్ల ప్రకారం, కేసు దర్యాప్తుకు సంబంధించిన డిజిటల్‌ సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా తొలగించడం అనేది నాన్‌ బెయిలబుల్‌ నేరం. ఫుటేజ్‌ డిలీట్‌ చేసినట్లు రుజువైతే సదరు పోలీసు అధికారులను సర్వీస్‌ నుండి సస్పెండ్‌ చేయడం, డిస్మిస్‌ చేయడంతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఆ ఫుటేజీని తిరిగి పొందడం సాధ్యమే 
వాస్తవానికి పోలీస్‌స్టేషన్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ కేవలం ఆ స్టేషన్‌లోని డీవీఆర్‌లో మాత్రమే కాక, మరో రెండు చోట్ల భౌతికంగా రికార్డ్‌ చేయడం తప్పనిసరి. ఓ చోట ఫుటేజీ పోయినా మరో చోట నుంచి ఫుటేజీని తీసుకునేందుకే ఇలాంటి ఏర్పాటు చేశారు. సాయికృష్ణ కేసులో మే 1 నుంచి జూన్‌ 1 వరకు నెల రోజుల సీసీ టీవీ ఫుటేజీ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు గుర్తించారు. అసలు వాస్తవాలు వెలుగులోకి రాకూడదన్న ఉద్దేశంతోనే సీసీ టీవీ ఫుటేజీని పోలీసు పెద్దల ఆదేశాల మేరకు తొలగించినట్లు పోలీసు అధికారులే చెబుతున్నారు. ఇదంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా నెల రోజుల సీసీ టీవీ ఫుటేజీ డిలీట్‌ అయ్యిందంటే కమిషనర్‌కు తెలియకుండా ఉండే అవకాశం లేదన్నది రిటైర్డ్‌ పోలీసు అధికారుల మాట. ఇటీవల ఓ కోర్టు ధిక్కార కేసు, ఓ అక్రమ నిర్భంధం కేసులో సీసీ టీవీ ఫుటేజీ డిలీట్‌ వ్యవహారం హైకోర్టు ముందు చర్చకు వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీని డిలీట్‌ చేయాలంటే పోలీసులు నేరుగా చేయలేరని, జిల్లా ఎస్పీ లేదా కమిషనర్‌ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వమే స్వయంగా హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కేసులో సిట్‌ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపితే అసలు సీసీ టీవీ ఫుటేజీని ఎవరు డిలీట్‌ చేశారు.. ఎప్పుడు చేశారు.. ఎంత మేర డిలీట్‌ చేశారనే వివరాలను సులువుగానే తెలుసుకోవచ్చు. డిలీట్‌ చేసిన ఫుటేజీని తిరిగి పొందడం కూడా సాధ్యమే అని నిపుణులు చెబుతున్నారు.

లాకప్‌డెత్‌ల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 
⇒ దేశంలో పోలీసులు పౌరుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుండటం, అక్రమంగా నిర్బంధించడం, లాకప్‌డెత్‌లు ఎక్కువైపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పరంవీర్‌ సింగ్‌ సైనీ వర్సెస్‌ బల్జీత్‌ సింగ్‌’ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్నీ పోలీస్‌ స్టేషన్లలో సీసీ టీవీల నిర్వహణపై అత్యంత కఠినమైన ఆదేశాలిచ్చింది.
⇒ నిందితులను, అనుమానితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వారి పట్ల దారుణంగా, క్రూరంగా ప్రవర్తించినప్పుడు పోలీసులు ‘అక్కడ సీసీ టీవీ పనిచేయడం లేదు‘ లేదా ‘ఆ సమయానికి పవర్‌ కట్‌ అయింది‘ అని సాకులు చెబుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో పోలీసులకు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీస్‌ స్టేషన్లలో రికార్డ్‌ అయ్యే ఆడియో, వీడియో డేటాను కనీసం 12 నుండి 18 నెలల పాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. 

⇒ కేవలం వీడియో మాత్రమే కాదు, పోలీస్‌ స్టేషన్లలో జరిగే ప్రతి సంభాషణ రికార్డ్‌ అయ్యేలా ఆడియో సిస్టమ్, రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా నైట్‌ విజన్‌ కెమెరాలు ఉండాలి. సీసీటీవీల పర్యవేక్షణ కేవలం ఆయా పోలీస్‌ స్టేషన్ల చేతుల్లోనే ఉండదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన ’స్వతంత్ర కమిటీలు’ ఈ కెమెరాల పని తీరును, ఫుటేజ్‌లను నిరంతరం ఆడిట్‌ చేస్తూ ఉంటాయి. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా ఫుటేజ్‌ డిలీట్‌ చేసినా, నేటి ఆధునిక సాంకేతికత ముందు వారు దొరికిపోవడం ఖాయం. 
⇒ ఎందుకంటే ఆధునిక సిస్టమ్స్‌లో ఆటోమేటిక్‌ ‘ఆడిట్‌ లాగ్‌’ రికార్డ్‌ అవుతుంది. అంటే, ఏ యూజర్‌ ఐడీ ద్వారా, ఏ తేదీన, ఏ సమయంలో లాగిన్‌ అయ్యారు? ఏ ఫైల్‌ను డిలీట్‌ చేశారు? అనే సమాచారం సిస్టమ్‌ లోపల నమోదవుతుంది. దీనిని పోలీసులు కూడా మార్చలేరు. హార్డ్‌ డిస్క్‌ నుండి డిలీట్‌ చేసిన లేదా ఫార్మాట్‌ చేసిన డేటాను పూర్తిగా తుడిచి పెట్టడం అంత సులువు కాదు. 

⇒ కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సదరు డివైజ్‌లను సైబర్‌ ఫోరెన్సిక్‌ లాబొరేటరీకి పంపితే, నిపుణులు డిలీట్‌ చేసిన ఫుటేజ్‌ను మళ్లీ విజయవంతంగా రికవరీ చేయగలరు. పోలీస్‌ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్‌ను నేరుగా డిలీట్‌ చేసే భౌతిక అవకాశం పోలీసులకు కొంత మేర ఉన్నప్పటికీ.. చట్టపరమైన నిబంధనలు, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ టెక్నాలజీ, కోర్టుల నిరంతర పర్యవేక్షణ కారణంగా అలా చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.

సీసీటీవీ కెమెరా పనిచేయకపోతే కమిటీకి చెప్పాల్సిందే 
⇒ ఒకవేళ పోలీస్‌ స్టేషన్‌లో కెమెరా పని చేయకపోతే, ఆ విషయాన్ని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వెంటనే జిల్లా స్థాయి కమిటీకి లిఖిత పూర్వకంగా నివేదించాల్సి ఉంటుంది. లాకప్‌లో అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పౌరుల హక్కులకు రక్షణ కల్పిస్తున్నాయి. సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు ‘ఫైల్‌ కార్వింగ్‌‘ అనే పద్ధతి ద్వారా తొలగించిన ఫుటేజీని యథావిధిగా బయటకు తీస్తారు. 

⇒ ప్రతి ఆధునిక సీసీటీవీ సాఫ్ట్‌వేర్‌ వెనుక ఒక రహస్య డైరీ లాంటిది రన్‌ అవుతుంది. దీన్నే ’ఆడిట్‌ లాగ్‌’ అంటారు. ఒక అధికారి ఫుటేజ్‌ డిలీట్‌ చేస్తే, అది లాగ్‌ ఫైల్‌లో రికార్డ్‌ అయిపోతుంది. దీనిని సాధారణ యూజర్లు మార్చలేరు. దర్యాప్తు అధికారులు ఈ లాగ్‌ను పరిశీలించి, ‘ఫలానా సమయంలో, ఫలానా ఐడీతో ఫుటేజ్‌ డిలీట్‌ చేశారు‘ అని తేలుస్తారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో పోలీస్‌ స్టేషన్‌ సీసీ టీవీలను కేవలం ఆ స్టేషన్‌కే పరిమితం చేయడం లేదు. 

⇒ స్టేషన్‌లోని కెమెరాల లైవ్‌ ఫీడ్‌ నేరుగా జిల్లా ఎస్పీ ఆఫీస్‌కు లేదా స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు కనెక్ట్‌ అయి ఉంటుంది. ఒకవేళ లోకల్‌ స్టేషన్‌లో పోలీసులు డీవీఆర్‌ను పగలగొట్టినా లేక సీసీ టీవీ ఫుటేజీని డిలీట్‌ చేసినా, మెయిన్‌ హెడ్‌క్వార్టర్స్‌ సర్వర్‌లో ఆ డేటా సురక్షితంగా బ్యాకప్‌ అయి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కెమెరా వైర్లు పీకేయాలని చూసినా, లేదా కెమెరా ముందు ఏదైనా అడ్డం పెట్టాలని ప్రయత్నించినా, సిస్టమ్‌ వెంటనే మెయిన్‌ కమాండ్‌ సెంటర్‌కు అలర్ట్‌ మెసేజ్‌ పంపిస్తుంది. దీనివల్ల ‘కెమెరా ఆటోమేటిక్‌గా పాడైపోయింది‘ అని పోలీసులు అబద్దాలు చెప్పేందుకు ఆస్కారం ఉండదు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement