సాయికృష్ణ కేసు.. సీఐ నాగరాజు వెనక ఉన్నవారి సంగతేంటి?
సాక్షి, తాడేపల్లి: రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టినప్పుడే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పతనం అయ్యిందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి,మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయికృష్ణ కేసులో వరుస పరిణామాలపై పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది.పోలీసులు చంద్రబాబుకు ప్రయివేటు సైన్యంలా మారిపోయారు. పోలీసుల చేతిలో సాయికృష్ణ లాకప్ డెత్ అయితే నెల రోజులుగా ప్రభుత్వం ఏం చేస్తోంది?. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయికష్ణ నివాసానికి వెళ్తేగానీ ప్రభుత్వం స్పందించదా?. కేసును సీఐ నాగరాజుతో ముడిపెట్టి వదిలేస్తారా?. సీఐ నాగరాజు వెనుక ఉన్న మిగతా పోలీసు అధికారుల సంగతేంటి?. వారికి తెలియకుండానే లాకప్డెత్ చేసి శవాన్ని మాయం చేస్తారా?.రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టినప్పుడే పోలీసు వ్యవస్థ పతనం అయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసు స్టేషన్లో అడుగు పెట్టే పరిస్థితే లేదు. పోలీసుల వైఖరికి ఇదే నిదర్శనం. దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య దారుణం. సీఐ నాగరాజు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు అధికారులు సీరియస్గా ఉంటే కిందిస్థాయిలో ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయా?’అని ప్రశ్నించారు.