సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు వైఎస్సార్సీపీ నేతలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వాగ్వాదం జరిగింది. పార్టీ నేతలను పోలీసులు ముందుకు కదలనివ్వలేదు.
ఈ క్రమంలో పోలీసులు వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇక, స్టీల్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వారిలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి ఉన్నారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలు మాత్రం కచ్చితంగా జిందాల్ స్టీల్స్ పరిశీలించి తీరుతామని చెబుతున్నారు.


