
మైలవరం(ఎన్టీఆర్): ‘మా మధ్య ఎటువంటి గొడవలు లేవని’ మైలవరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిన్నారుల తల్లి చంద్రిక చెప్పారు. మైలవరంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చంద్రిక మాట్లాడుతూ భర్త రవిశంకర్ తాను ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్లమన్నారు. మూడు నెలల క్రితం బహ్రయిన్ వెళ్లానని, ఈ నెల 5,6,7 తేదీల్లో తన భర్త రవిశంకర్తో మాట్లాడానని పేర్కొన్నారు. 8వ తేదీ పుట్టిన రోజు అని చెప్పాడని, ఆ రోజున పిల్లలతో మాట్లాడతానని తాను చెప్పారన్నారు. 8న అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని, వదినకు ఫోన్ చేసినట్లు తెలిపింది. పిల్లలను ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.
– మైలవరం పీఎస్లో ఎస్ఐ సుధాకర్ చిన్నారుల తల్లి చంద్రికతో పాటు మరి కొంతమంది బంధువుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
పోలీస్లకు దొరికిన సూసైడ్ నోట్
రవిశంకర్ ఇంట్లో అతను రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించినట్లు సమాచారం. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. చంద్రిక నన్ను క్షమించు. నీకు ఇచ్చిన మాట తప్పాను, నా పిల్లలుగా పుట్టిన పాపానికి వీళ్లని బలి ఇచ్చాను. 8.6.92 తన పుట్టిన రోజు అని అదే రోజు నాకు పిల్లలకు చావు రోజు అని రవిశంకర్ రాసిన లేఖలో పేర్కొన్నాడు.
ముమ్మరంగా గాలింపు
గత ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రవిశంకర్ చివరి కాల్ ఐదు నిమిషాలు మాట్లాడినట్లు రికార్డు అయింది. అనంతరం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలోకి దూకి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లు, బోట్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.