
కలెక్టర్ ప్రశ్నలకు చకచకా జవాబిచ్చిన విద్యార్థిని
నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలిమెట్టలోని ఏపీ మోడల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. పదోతరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో ‘రైతు.. పోస్టుమాన్’ పాఠం చెప్పారు.
అనంతరం పలు ప్రశ్నలు సంధించగా, విద్యార్థుల నుంచి మౌనమే సమాధానమైంది. అయితే కొండజుటూరు గ్రామానికి చెందిన సిద్ధం ప్రవల్లిక కలెక్టర్ ప్రశ్నలకు చకచకా జవాబు చెప్పింది. ఇలా పాఠం పూర్తయ్యేంత వరకు పదేపదే కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు ప్రవల్లిక సమాధానం చెబుతూ శభాష్ అనిపించుకుంది.
మధ్యాహ్న భోజనం సమయంలో ప్రవల్లికను కలెక్టర్ ప్రత్యేకంగా పిలిచి స్వయంగా భోజనం తినిపించడం విశేషం. దీంతో ప్రవల్లికను ఉపాధ్యాయులు, సిబ్బంది, సాటి విద్యార్థులు అభినందించారు.