టీచర్లు ఖాళీ.. మంత్రి కంగాళి! | Nadendla Manohar is angry over teachers leaves | Sakshi
Sakshi News home page

టీచర్లు ఖాళీ.. మంత్రి కంగాళి!

Jan 29 2025 6:02 AM | Updated on Jan 29 2025 6:02 AM

Nadendla Manohar is angry over teachers leaves

తెనాలి శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్‌ హైస్కూల్  ల్లో మంత్రి నాదెండ్ల హడావుడి 

24 మంది టీచర్లలో ఐదుగురు సెలవులో ఉండటంపై ఆగ్రహం 

ఉన్న టీచర్లలో 50 శాతం మించకుండా సెలవు తీసుకునే వెసులుబాటు 

ఈ విషయం తెలుసుకోకుండా టీచర్లకు మెమోలివ్వాలంటూ ఆదేశం

సాక్షి, అమరావతి: నిబంధనలు తెలుసుకోకుండా మంత్రి నాదెండ్ల మనోహర్‌ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్కూల్లో ఉన్న టీచర్లలో 50 శాతం వరకు సెలవు తీసుకొనే వెసులుబాటు ఉన్నా, అయినా తక్కువ మందే సెలవులో ఉన్నప్పటికీ, వారందరికీ మెమోలు జారీ చేయాలంటూ ఎంఈవోను ఆదేశించడంపై ఉపాధ్యాయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలను మంత్రి మనోహర్‌ సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఉపాధ్యాయ, విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. 24 మంది టీచర్లలో ఐదుగురు సాధారణ సెలవు, మరో ఇద్దరు హాఫ్‌డే సెలవు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. ‘ఒకేసారి ఏడుగురు టీచర్లు ఎలా సెలవు తీసుకుంటారు?  మీరెలా ఇచ్చారు’ అంటూ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతేగాకుండా సెలవు పెట్టిన ఉపాధ్యాయులకు మెమోలు జారీచేయాలని ఎంఈవోను ఆదేశించారు. ఈ విషయంపై మంగళవారం డీఆర్సీ సమావేశంలో కలెక్టర్, డీఈవోలతో చర్చిస్తానన్నారు. మొత్తం 399 మంది విద్యార్థుల్లో 80 మంది హాజరు కాకపోవడంపై మంత్రి హెచ్‌ఎంని ప్రశ్నించారు. 

మంత్రి మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మంత్రి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మెమోలు ఇవ్వాలని మంత్రి ఆదేశిస్తే తాము ఎలా పనిచేయగలమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సమస్యలు అడగకుండా మంత్రి హడావుడి  
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి మార్గం చూపాల్సిన మంత్రే టీచర్లను బెదిరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. వాస్తవానికి శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలలో 46 ఉపాధ్యాయ పోస్టులకు గాను, 36 మందే టీచర్లున్నారు. వీరిలో 12 మందిని ఇటీవల డెప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపించారు. 

మిగిలిన 24 మందిలో సోమవారం ఐదుగురు సీఎల్‌ తీసుకోగా, ఇద్దరు మధ్యాహ్నం నుంచి హాఫ్‌ డే సెలవు పెట్టారు. అయితే, మంత్రి మనోహర్‌ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై మాట్లాడకుండా, బోధనాపరమైన సమస్యలు తెలుసుకోకుండా టీచర్ల సెలవుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. 

వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఉపాధ్యాయుల్లో 50 శాతం తగ్గకుండా విధులకు హాజరు కావాలి. దీనిప్రకారం ఈ స్కూల్లో 11 మంది వరకు సెలవు తీసుకోవచ్చు. కానీ ఐదుగురే సెలవు పెట్టినా మంత్రి హడావుడి చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement