
అనంతపురం: సార్ .. నా కూతురిని నేను పోషించలేను. మీరే నా కూతురికి ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుతున్నా. మీ దగ్గరే వదిలి వెళ్లిపోతున్నాను. తన జీవితం బాగుండాలని వేడుకుంటున్నాను. నేను చనిపోతున్నా. నా కూతురిని బాగా చూసుకోండి ప్లీజ్. ఒక తల్లిగా ఇది నా ఆవేదన’ అంటూ లెటర్ రాసిన ఓ తల్లి వారం వయస్సు కలిగిన ఆడ శిశువును అనాథగా వదిలి వెళ్లిపోయింది. ఈ సంఘటన అనంతపురంలోని విజయనగర్ కాలనీలో సోమవారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి వచ్చింది.
నవజాత శిశువుకు గౌను వేసి చూడముచ్చటగా తీర్చిదిద్దిన తల్లి బిడ్డను అనాథగా వదిలివెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. శిశువు ఏడుపు విని అటువైపు వెళ్తున్న వారు గమనించి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చంద్రకళ, చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి, సూపర్వైజర్ నవీన్, ఆశా వర్కర్ గౌరి ఘటనా స్థలానికి వెళ్లారు. శిశువును అక్కున చేర్చుకొని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడి నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ పసికందు తల్లి తన ఆవేదనను లేఖలో రాసి అక్కడ ఉంచడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.