అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ, ఫసల్బీమా పథకాలకు సంబంధించి చివరి గడువు శుక్రవారం సాయంత్రానికి 2.26 లక్షల హెక్టార్లకు ప్రీమియం చెల్లించి రైతులు బీమా పరిధిలోకి చేరినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అందులో 1.01 లక్షల హెక్టార్ల పంటలకు వాతావరణ బీమాకు ప్రీమియం కట్టగా.. 1.25 లక్షల హెక్టార్ల పంటలకు ఫసల్బీమా ప్రీమియం చెల్లించారని పేర్కొన్నాయి. మొత్తం మీద 1.45 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. 2024 ఖరీఫ్లో అనంతపురం జిల్లాలో 3,62,601 హెక్టార్లు బీమా పరిధిలోకి రాగా... అప్పటితో పోల్చితే ఈసారి 37 శాతం విస్తీర్ణం తగ్గుదల నమోదైంది.
రెండో స్థానంలో ‘అనంత’
రాష్ట్రంలో శుక్రవారం నాటికి 2.90 లక్షల హెక్టార్లకు బీమా చేయించుకోవడంతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2.26 లక్షల హెక్టార్లతో అనంతపురం రెండో స్థానం, 1.30 లక్షల హెక్టార్లతో శ్రీసత్యసాయి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక ఏ జిల్లాలోనూ లక్ష హెక్టార్లకు మించి బీమా చేయించలేదు.
ఫసల్ బీమా గడువు పొడిగింపు
పంటల బీమా ప్రీమియం గడువు పొడిగింపుపై రకరకాలుగా ప్రచారం జరిగింది. కొందరు ఫసల్బీమాకు మాత్రమే పొడిగించారని, వాతావరణ బీమాకు లేదని చర్చించుకున్నారు. బీమా ప్రీమియం చెల్లించేందుకు జిల్లాలో రైతులు వారం రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. గడువు పొడిగిస్తే రైతులందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపు గడువును మాత్రమే ఈ నెల 15 వరకు పొడిగించింది. ఇక వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపునకు ఎటువంటి గడువునూ పొడిగించలేదు.


