
నేడు తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
18వ తేదీన ఉదయం తమిళనాడు రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
